చంద్రబాబు మరో బకాయినీ జగన్ తీర్చారు.. లక్ష మంది ఖాతాల్లోకి వేల కోట్లు.. ఏపీలో ఉపాధికి భారీగా ఊతం..
''వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME). ప్రభుత్వం అండగా ఉంటేనే చిన్న పరిశ్రమలు తమ కాళ్లపై తాము నిలబడటంతోపాటు నలుగురికీ ఉద్యోగాలు కల్పిపంచగలవు. కానీ ఇంత కీలకమైన రంగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏకంగా రూ.800 కోట్లను బకాయిలు చెల్లించకుండా వదిలేశారు. వాటన్నింటిని వైసీపీ ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ వస్తోంది. బకాయిల చెల్లింపులతోపాటు అదనంగా సరికొత్త ప్రోత్సాహకాలను కూడా కల్పిస్తున్నాం..''అంటూ ఎంఎస్ఎంఈల ఖాతాల్లోకి భారీ మొత్తంలో డబ్బును ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
Recommended Video

నిన్న బీమా.. ఇవాళ ఎంఎస్ఎంఈ..
చంద్రబాబు సర్కారు పెండింగ్లో ఉంచిన భారీ బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తోన్న జగన్.. రెండ్రోజుల కిందటే పంటల బీమా పరిహారం(క్లెయిమ్) చెల్లింపులకు సంబంధించిన రూ. 596.36 కోట్లను విడుదల చేశారు. తద్వారా 13 జిల్లాల్లోని సుమారు 6లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లయింది. తాజాగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)లకు సంబంధించి అదే టీడీపీ సర్కారు చెల్లించకుండా వదిలేసిన బకాయిలను కూడా జగన్ తీర్చేశారు.

రీస్టార్ట్ ఏపీ..
కరోనా విపత్తు సమయంలో కుదేలయ్యే పరిస్థితికి చేరుకున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మళ్లీ పుంజుకునేలా ‘ఏపీ రీస్టార్ట్' పేరుతో వైసీపీ సర్కారు రూ.1,168 కోట్లతో ప్యాకేజీని ప్రకటించడం విదితమే. దీనికి సంబంధించిన రెండో విడత రాయితీ బకాయి రూ.512 కోట్లను సీఎం జగన్ సోమవారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి ఆన్ లైన్ లో డబ్బును పంపారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల్లోని ఎంఎస్ఎంఈలతో ఆయన మాట్లాడారు. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మొదటి విడడత రాయితీ బకాయి(రూ.450 కోట్ల)ను గత నెలలోనే అందజేసిన సంగతి తెలిసిందే.

బకాయిలేకాదు.. రాయితీలు, రుణాలు కూడా..
దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014-15 నుంచి చంద్రబాబు సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెండింగ్ లో ఉంచింది. కాగా ఇప్పుడు, టీడీపీ సర్కారు బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించిన రాయితీలు కూడా కలిపి మొత్తం రూ.962.62 కోట్లను రెండు విడతలుగా జగన్ సర్కారు చెల్లించింది. అలాగే, కరోనా వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కరెంటు ఫిక్స్డ్ ఛార్జీల కింద మరో రూ.180 కోట్లు మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీఎస్ఎఫ్సీ ద్వారా ఎంఎస్ఎంఈలకు రూ.200 కోట్లతో పెట్టుబడి రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని, ఈ రుణాలపై ఆరు నెలల మారటోరియం కూడా ఉంటుందని సీఎం తెలిపారు.

దాదాపు లక్ష మంది ఖాతాల్లోకి..
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 98 వేలుగా ఉందని, వాటిద్వారా 10 లక్షలపైచిలుకు మంది ఉపాధి పొందుతున్నారని, నేటితో వాళ్లందరి ఖాతాల్లోకి రూ.1,168 కోట్లు జమ అయ్యాయని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. ‘‘ప్రైవేటు రంగంలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈలే. ఈ రంగాన్ని కాపాడుకోలేకపోతే నిరుద్యోగ సమస్యను ఎప్పటికీ అధిగమించలేం. ప్రభుత్వం అడగా ఉంటేనే అవి మనగలుగుతాయి. అందుకే వీటిపై అత్యంత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను కోరాను. లాక్డౌన్ వల్ల కుదేలైన చిన్న పరిశ్రమల్ని మళ్లీ నిలబెట్టుకుందాం..''అని వ్యాఖ్యానించారు.

ఇది కదా విజన్ అంటే..
సీఎంతో ఇంటరాక్షన్ సందర్భంగా రీస్టార్ట్ ప్యాకేజీతో లబ్దిపొందిన చిన్న పరిశ్రమల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈలోని ఒక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటే, దాని ద్వారా 40 కుటుంబాలు మనగలుగుతాయని లబ్దిదారులు అన్నారు. రీస్టార్ట్ ప్యాకేజీ రెండో విడత బకాయిల చెల్లింపులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ‘‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జగన్ మరోవరం. చంద్రబాబు పెండింగ్ లో పెట్టిన ప్రోత్సాహకాలు, రాయితీల విడుదల. లక్ష ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ ప్యాకేజ్, విద్యుత్ బకాయిల మాఫీ. పది లక్షల మంది జీవనోపాధికి భరోసా. ఇది కదా విజన్ అంటే..''అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications