వ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు -ఆక్సిజన్, పగటి కర్ఫ్యూపైనా
కరోనా మహమ్మారి రెండో దశ విలయం ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా మారడం, ఆస్పత్రులన్నీ నిండుకున్నా, రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో సర్వత్రా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరతతో దాదాపు అన్ని రాష్ట్రాలూ ఇంకా అల్లాడుతున్నాయి. కేంద్ర సర్కారు అట్టహాసంగా మే1 నుంచే మూడో విడత వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించి, 18 నుంచి 45ఏళ్లలోపు వ్యక్తులందరికీ టీకాలిస్తామని ప్రకటించినా, వ్యాక్సిన్ల కొరత వల్ల చాలా రాష్ట్రాలు ప్రక్రియను వాయిదా వేశాయి. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్నవారు రెండో డోసు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. అసలు కేంద్రం వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లే పెట్టలేదని ఓవైపు, కాదూ, 26కోట్ల డోసులకు ఆదేశించామని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో..

పీఎం మోదీకి సీఎం జగన్ లేఖ
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి కేంద్ర సర్కారు తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖాస్త్రాన్ని సంధించనున్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు...

వ్యాక్సిన్లు, ఆక్సిజన్ ఇవ్వండి..
వాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. కేంద్రం నిర్దేశించినట్లు మే1 నుంచి కాకుండా జూన్ 1 తర్వాత 18 నుంచి 45ఏళ్లలోపు వ్యక్తులకు ఉచితంగా టీకాలు అందిస్తామన్న ఏపీ సర్కారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల పంపిణీలో 45 ఏళ్లు పైబడిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడైంది. ఏపీకి కరోనా వాక్సిన్లు త్వరగా కేటాయించాలని ప్రధానికి జగన్ విన్నవించనున్నారు. అలాగే, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుంచి ఏపీకి ఆక్సిజన్ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలనీ ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

ఏపీలో పగటి పూట కర్ఫ్యూ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలులో ఉండగా, బుధవారం నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు నడవవు. కాలేజీలను సైతం ఉదయం 11.30 గంటల వరకే నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే అన్ని దుకాణాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం తర్వాత ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.












Click it and Unblock the Notifications