తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తిపాస్తులు భారీగా పెరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల సమయానికి పెరుగదల అంతరం భారీగానే ఉంది. మొత్తం ఆస్తుల విలువ రూ.757.65 కోట్లుగా చూపించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వైఎస్ జగన్ గురువారం తన నామినేషన్ సమర్పించారు. కొద్దిరోజుల క్రితం మొదటి సెట్ సమర్పించగా తాజాగా రెండో సెట్ దాఖలు చేశారు.
నామినేషన్ సందర్భంగా వైఎస్ జగన్ తన అఫిడవిట్లో ఆస్తిపాస్తులతోపాటు క్రిమినల్ కేసులను కూడా వెల్లడించారు. జగన్ ఆస్తుల విషయానికి వస్తే 2019 నుంచి ఐదేళ్లలో రూ.154 కోట్లు పెరిగింది. లెక్కల్లో 41 శాతం పెరుగుదల ఉంది. జగన్ పేరుపై రూ.529 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు, చేతిలో రూ.7 వేలు నగదు ఉంది. కుటుంబంలో ఎవరి పేరుపై కారు లేదు.

భార్య భారతి, కుమార్తెల పేరిట ఆస్తులు భారీగా ఉన్నాయి. భారతి పేరుమీద రూ.124 కోట్ల ఆస్తి, ఇద్దరు కుమార్తెల పేరుమీద రూ.51 కోట్ల ఆస్తులు ఉన్నాయి. భారతికి రూ.5.5 కోట్ల విలువ చేసే ఆరున్నర కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇడుపులపాయలో జగన్ కు 35 ఎకరాల భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, హైదరాబాద్ లోని బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో స్థలాలున్నాయి. వ్యవసాయేతర భూముల విలువ రూ.46 కోట్లుగా ఉంది. వైఎస్ జగన్పై మొత్తం 26 కేసులు ఉన్నాయి. వాటిలో 11 సీబీఐ కేసులు, 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, పలు పోలీస్స్టేషన్లలో 6 కేసులు ఉన్నాయి.
పులివెందుల నుంచి పోటీపడుతున్న వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి బరిలో ఉన్నారు. కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా, అతనికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల, టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications