సీఎం గారి షెడ్డు.. కేరాఫ్ విశాఖ విమానాశ్రయం..
అధికారం చేతిలో ఉంటే.. అనుకోవడమే ఆలస్యం ఎంతటి పనైనా క్షణాల్లో జరిగిపోవాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు ఉరుకులు పరుగులకు ఈ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయని అభిప్రాయ పడుతున్నారు పలువురు. ఇప్పటికే అటు విజయవాడలో, ఇటు హైదరాబాద్ లో క్యాంప్ కార్యాలయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు ఇదే తరహాలో విశాఖలోను ఒక తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారట.
నిజానికి ఏపీ సీఎం చంద్రబాబు, రాజధాని అమరావతిలో పర్యటించిన దానికంటే.. విశాఖ టూర్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని ఆయన షెడ్యూల్స్ ను గమనిస్తున్న కొందరి వాదన. దానికి తగ్గట్టే వారానికి ఒకసారైన చంద్రబాబు విశాఖలో అడుగుపెడుగుతున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా విశాఖ విమానశ్రయంలో దిగి వెళ్తున్నారు చంద్రబాబు.
చంద్రబాబు తరుచుగా పర్యటిస్తుండడంతో మొత్తానికి విశాఖకు సీఎం మరియు మంత్రుల తాకిడి బాగానే పెరిగింది. పర్యటనకు వచ్చినప్పుడల్లా విశాఖలోని అతిథి గృహాన్నే పార్టీ అవసరాల కోసం వాడుతున్నారు. అయితే అతిథి గృహంలో విడిది వల్ల చాలా సమయం వృథా అవుతుందని భావించిన సీఎం.. విశాఖ విమానశ్రయానికి దగ్గరలోనే ఒక తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారట.
సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ ఎన్. యువరాజన్ గురువారం స్థల పరిశీలన కూడా చేసినట్టుగా సమాచారం. అయితే స్థలం నేవీ ఆధీనంలో ఉండడంతో అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గృహ నిర్మాణ శాఖ నిర్మించబోయే ఈ షెడ్డు భవిష్యత్తులో పార్టీ కార్యాలయంగా మారిపోయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.