జగన్ చేతుల్లోనే అంతా...! నోటీసుపై చేతులెత్తేసిన సీఎస్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వంపైనా వివిధ వర్గాల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఎన్నికల వేళ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్దితి ఉంది. దీనిపై ఒత్తిడి పెంచేందుకు ఆయా వర్గాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాయి. కానీ వెంటనే నిర్ణయాలు తీసుకునే పరిస్దితి లేకపోవడంతో వారికి ఎలాగోలా సర్ది చెప్పి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి.
ఏపీలో అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు పలు కీలక హామీలు ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకుంటారని అంతా ఆశించారు. కానీ వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి కొన్ని హామీలైతే అస్సలు ముట్టుకునేందుకు కూడా ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వానికి ఓ నోటీసు ఇచ్చిన ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అది కాస్తా పూర్తవడంతో ఇప్పుడు మరోసారి నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

నిన్న సాయంత్రం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి తదుపరి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చేందుకు ఏపీ జేఏసీ అమరావతి నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయానికి వెళ్లారు. అయితే ఉద్యమ కార్యాచరణ వివరిస్తూ సీఎస్ కు ఉద్యోగులు అనుకున్నట్లుగానే నోటీసు అందజేశారు. దాన్ని ఆద్యంతం పరిశీలించిన సీఎస్ జవహర్ రెడ్డి.. మీకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇప్పుడు తానేం చేయలేనంటూ చేతులెత్తేశారు. వాటిని ప్రభుత్వ పెద్దలే తేల్చాలంటూ చెప్పేశారు.
కేవలం ఆర్ధికేతర అంశాల వరకూ తాను స్పందిస్తానని, ఆర్ధిక పరమైన అంశాలపై తేల్చాల్సింది మంత్రివర్గ ఉపసంఘం, సీఎం జగనే అని సీఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు తేల్చిచెప్పేశారు. ఉద్యమం చేస్తామంటే చేసుకోండని కూడా చెప్పేశారు. దీంతో ఉద్యోగులు ఇప్పుడు మలి విడత ఉద్యమ కార్యాచరణను అమల్లోకి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఉద్యమ కార్యాచరణ పూర్తయిన తర్వాత సమ్మెలోకి వెళ్లే విషయాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications