ఏపీ ఇంఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. ఇందులో నిజమెంత..?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంఛార్జ్ "ముఖ్యమంత్రి"గా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్త జోరుగా షికారు చేస్తోంది. నాలుగు రోజులు పాటు ఇంచార్జ్ "ముఖ్యమంత్రి"గా బాధ్యతలు చేపట్టనున్నారనేది దీని సారాంశం. సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో పవన్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు ఈ వార్త వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఇంఛార్జ్ ముఖ్యమంత్రి అనే ప్రొవిజన్ రాజ్యాంగంలో లేదు. ఒక వేళ ప్రస్తుత ముఖ్యమంత్రి కొన్ని అనారోగ్య కారణాలతో లేదా అచేతనమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప ఇంఛార్జ్ ముఖ్యమంత్రి అనే స్థానం గురించి చర్చ ఉండదు. అది కూడా కేబినెట్లోని అత్యంత సీనియర్ మంత్రి గవర్నర్ ఆమోదంతో ఈ బాధ్యతలు చేపడతారు. కానీ ప్రస్తుతం ఏపీలో ప్రచారంలో ఉన్న ఇంఛార్జ్ ముఖ్యమంత్రి అనేది అవాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ ఇంఛార్జ్ ముఖ్యమంత్రి అంటే కొన్ని టీడీపీ ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్స్లోనే రావడం కొంత కన్ఫ్యూజన్కు గురిచేస్తోంది. అంతేకాదు జనసేన సోషల్ హ్యాండిల్స్ కూడా పవన్ను ప్రమోట్ చేసేందుకు ఇదే మంచి అవకాశం అన్నట్లుగా సర్క్యులేట్ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా పాలన దాదాపుగా నిలిచిపోయింది. ఈ సమయంలో తనకు నమ్మినబంటుగా ఉన్న పనీర్ సెల్వంను ఇంఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. కానీ అధికారికంగా ముఖ్యమంత్రి హోదా మాత్రం జయలలిత వద్దే ఉన్నింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు నాలుగు రోజులు పాటు సింగపూర్ లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంఛార్జ్ సీఎంగా పవన్ కు బాధ్యతలు అప్పగించారన్న వార్త అవాస్తవం. చంద్రబాబు సింగపూర్ పర్యటన అధికారికమే. ఆయన వెంట పలువురు మంత్రులు నారాలోకేష్, టీజీ భరత్ కూడా వెళుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, రాజధాని అంశాలపై అక్కడ చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications