ఏపీలో ఆలయాల పరిరక్షణ కోసం మరో కీలక ముందడుగు: దేవాలయాలకు జియోట్యాగింగ్: డీజీపీ
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి మండలం పరిధిలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం దగ్ధమైన ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ నిర్వహించడానికి ముందుకొచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలపై చోటు చేసుకున్న దాడుల ఘటనలన్నింటిపైనా విచారణ నిర్వహించడానికి సమాయాత్తమౌతోంది. అదే సమయంలో ఆలయాలను పరిరక్షించడానికి మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
దేవాలయాల వద్ద జియో ట్యాగింగ్ను ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం తక్షణ చర్యలను తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఆదివారం ఆయన మంగళగిరలోని ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆలయాలను పరిరక్షించే విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించొద్దని సూచించారు. కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నిత అంశం కావడం వల్ల ఆలయాలపై దాడులు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాలని గౌతమ్ సవాంగ్ అన్నారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను నెలకొల్పాలని సూచించారు. నేరచరిత్ర గల వారి కదలికలను నిశితంగా గమనించాలని, వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. దేవాలయాల పాలక మండలి సభ్యులతో తరచూ సమావేశాలను నిర్వహించాలని, వారితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని గౌతమ్ సవాంగ్ చెప్పారు. సోషల్ మీడియాలో నిరాధారంగా సర్కులేట్ అయ్యే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించొద్దని అన్నారు.
Recommended Video
ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్ను ఏర్పాటు చేయాలని, వాటిని స్థానిక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు ఉద్దేశించిన పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. అంతర్వేది తరహా ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. అంతర్వేది ఘటపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉందని, మతపరమైన దాడులను ప్రోత్సహించడం, దాడులకు పాల్పడే వారిపట్ల కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయడానికీ వెనుకాడదలచుకోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications