మీ అమ్మతనానికి చలించిపోయాం.. ఏపీ డీజీపీ సవాంగ్ ఉద్వేగం.. మహిళకు సెల్యూట్..
ఎప్పుడూ సీరియస్ అంశాలతో, నేరస్తులతో, నేరాల ఛేదనలో బిజీగా ఉండే పోలీసులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని నిరూపించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. కరోనా వైరస్ విధుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సేవ చేసిన ఓ మహిళ ఉదంతం సోషల్ మీడియాలో చూసిన సవాంగ్.. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
కరోనా విధుల్లో పోలీసులకు చిరు సాయం..
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యాక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రజలు ఇళ్లలో నుంచి వచ్చేందుకే భయపడుతున్నారు. పోలీసులు మాత్రం నిత్యం రోడ్లపైనే ఉంటూ కాపలా కాస్తున్నారు. ఇలాంటి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన లోకమణి అనే పేద మహిళ పోలీసులను కరోనా విధుల్లో చూసి జాలి పడింది. వారికి మంచినీళ్లు అందించే దిక్కులేని పరిస్ధితుల్లో రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్ కొని మరీ వారికి అందించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సాధారణ ప్రజలు సైతం ఆమెకు సెల్యూట్ చేశారు. ఆమె సేవను అభినందించారు.
ఇవాళ డీజీపీ సెల్యూట్..
తూర్పుగోదావరి జిల్లా తునిలో లోకమణి అనే మహిళ పోలీసులకు కూల్ డ్రింక్స్ అందించి వారి దాహం తీర్చిన విషయం ఆ నోటా ఈ నోటా డీజీపీ గౌతం సవాంగ్ కు చేరింది. అయితే ఆమెను అభినందించే తీరిక కూడా లేని పరిస్ధితుల్లో వారం రోజులుగా ఎదురుచూస్తున్న సవాంగ్... ఇవాళ మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించి మరీ ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు ఆమె చేసిన సేవకు సెల్యూట్ చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారు.
సోషల్ మీడియాలో వీడియో చూశాక...
తునిలో లోకమణి పోలీసులకు కూల్ డ్రింక్ బాటిల్స్ అందించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న డీజీపీ.. తాను పోలీసులకు చెప్పి వెతికి వివరాలు తెప్పించుకున్నానని, మీ అమ్మతనాన్ని చూసి చలించిపోయానని తన సంభాషణలో తెలిపారు. దీంతో ఏం మాట్లాడాలో తెలియక ఆ మహిళ కూడా రెండు చేతులు జోడించింది. ఈ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ ను గమనించిన తోటి పోలీసు అధికారులు సైతం చప్పట్లతో డీజీపీని, మహిళను కూడా అభినందించారు.