ఏపీలో కరోనా: మోపిదేవి Vs ముస్తఫా.. గుంటూరులో క్వారంటైనీల విడుదలపై వివాదం..
ఇన్నాళ్లూ కరోనా వైరస్ పై అధికార, ప్రతిపక్ష పార్టీలు తగువులాడుకోగా, ఇప్పుడు వైసీపీలోనే ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అందులో ఒకరు మంత్రి మోపిదేవి వెంకటరమణకాగా, రెండో వ్యక్తి గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా. మంగళవారం ఒక్కరోజే 44 కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 483కు పెరిగింది. అందులో 16 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా 114 కేసులతో గుంటూరు జిల్లాలో పరిస్థితి విషమించగా, నేతల మధ్య తగువు కూడా ఇదే జిల్లాపై చెలరేగింది.
ముస్తఫా డిమాండ్..
ఢిల్లీ మర్కజ్ ఘటన కారణంగా ఏపీలో కరోనా కేసులు పెరిగడం, తబ్లీగీకి వెళ్లొచ్చినవారిలో స్థానిక ఎమ్మెల్యే బంధువులు కూడా ఉన్నారని వెల్లడికావడం తెలిసిందే. ఢిల్లీ వెళ్లొచ్చినవాళ్లతోపాటు కుటుంబీకులు, చుట్టుపక్కల వారిని కూడా ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించింది. అయితే 14 రోజుల గడువు పూర్తయిన తర్వాత కూడా వాళ్లను విడుదల చేయకపోవడంపై ఎమ్మెల్యే ముస్తఫా స్పందించారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని వెంటనే ఇళ్లకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు..
రెడ్ జోన్లలో పర్యటన?
ఎమ్మెల్యే విడుదల చేయాలని కోరుతున్న క్వారంటైనీల్లో ఆయన కుటుంబీకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్వారంటైనీలను విడుదల చేయాలన్న డిమాండ్ తోపాటు లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే ముస్తఫా రెడ్ జోన్ ప్రాంతాలలో పర్యటించినట్లు వార్తలు వచ్చాయి. అసలే గుంటూరులో పరిస్థితి సున్నితంగా మారిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులే రూల్స్ ను బ్రేక్ చేయడమేంటనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై మంత్రి మోపిదేవి ఘాటుగా స్పందించారు.
కుదరదన్న మోపిదేవి..
ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్ చేసినట్లుగా క్వారంటైనీలను సరిగ్గా 14 రోజులకే విడుదల చేయాలన్న రూలేమీలేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గుంటూరు జిల్లాలో కేసులు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకుని మెలగాలని, బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా అర్దం లేకుండా మాట్లాడుతుండటం దురదృష్టకరమని మంత్రి అన్నారు.
Recommended Video
ఎందుకు కుదరదంటే..
ఏపీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో 14రోజుల పాటు క్వారంటైన్ పూర్తయిన వారికి తిరిగి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని, ఆ నేపథ్యంలోనే వీలైనన్ని ఎక్కువ రోజులు క్వారంటైన్ లో ఉంచుకుని, పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతే వ్యక్తులను డిశ్చార్జ్ చేస్తున్నామని మంత్రి మోపిదేవి వివరించారు. ఈ విషయంలో పార్టీలను చూడబోమని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాల్సిందేనని ఆయన అన్నారు.