సమ్మె దిశగా ఏపీ ఉద్యోగులు-పీఆర్సీ జీవోలపై హైకోర్టుకు-ఉద్యోగుల తీరుపై మంత్రుల ఎదురుదాడి
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం నానాటికీ ముదురుతోంది. పీఆర్సీ అమల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పోరును ఉద్యోగులు ముమ్మరం చేశారు. రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉద్యోగుల పోరుపై ఏపీ మంత్రులు ఎదురుదాడి ప్రారంభించారు. ఉద్యోగులు అన్నీ ఒప్పుకుని ఇప్పుడు పోరాటాలు చేస్తారా అని మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.

ఏపీలో పీఆర్సీ పోరు
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు పోరు బాట పట్టారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులు.. ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వం పీఆర్సీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పీఆర్సీ స్ధానంలో పాత జీతాలనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది ఇవాళ సాయంత్రం ఉద్యోగులు సమ్మెపై కీలక నిర్ణయం ప్రకటించే దిశగా అడుగులేస్తున్నారు.

హైకోర్టులో పిటిషన్
ప్రభుత్వం పీఆర్సీ అమలు కోసం జారీ చేసిన జీవోల్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్లు ఏపీ గెజిటెడ్ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య ప్రకటించారు. అమరావతి: విభజన చట్టం ప్రకారం మా వేతనాలు తగ్గేందుకు అవకాశం లేదని ఆయన వెల్లడించారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ తో అందరి వేతనాల్లో కోత పడుతోందన్నారు. విభజన తరువాత ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొందని, కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తూనే, న్యాయపరంగాను ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు, రెవెన్యూశాఖ, కేంద్ర హోమ్ శాఖ లను ప్రతివాదులుగా చేర్చామని కేవీ కృష్ణయ్య వెల్లడించారు.

ఉమ్మడి పోరుకు నిర్ణయం
అమరావతి: ఉద్యోగుల ఆకాంక్షల ప్రకారం అంతా కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి వ్రకటించారు. పీఆర్సీ జీవోలు వెనక్కు తీసుకునే వరకూ ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేస్తామన్నారు. ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకే వేదిక ఏర్పాటుకు వచ్చారని, సచివాలయ ఉద్యోగుల సంఘంగా తాము కూడా ముందడుగు వేస్తామన్నారు. ఇతర సంఘాల వారు కూడా సంప్రదింపులు చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

రేపు సమ్మె నోటీసు ?
ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై మండిపడుతున్న ఉద్యోగులు ఈ సాయంత్రం సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా రేపు ప్రభుత్వానికి ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు ఉద్యోగులు చర్చలు జరుపుతున్నారు. అలాగే ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి రావాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకునే వరకూ చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. రేపటి నుంచి ఆందోళనలు మరింత ముమ్మరం చేస్తామని వారు తెలిపారు.
Recommended Video

ఉద్యోగులపై మంత్రుల ఎదురుదాడి
రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగులు సిద్ధం కావడంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఉద్యోగ సంఘాలతో అన్ని చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరి కాదన్నారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు బొత్స తెలిపారు. ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చాక క్యాబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అంగీకరించి మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు.












Click it and Unblock the Notifications