ఫిబ్రవరి 3న చలో విజయవాడ.. లక్షలాది మందితో పోరు: పీఆర్సీ సాధన సమితి అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది ఉద్యోగులు తరలిరావాలని కోరాయి. ఉద్యోగులు మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని పీఆర్సీ సాధన సమితి నేతలు మండిపడ్డారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

దమ్ముంటే ఉద్యమాన్ని ఆపి చూడండి
ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పీఆర్సీ సాధన సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపగలదు అనుకుంటే ఆపి చూడాలని సవాల్ విసిరారు. మంత్రుల కమిటీని పాత జీతాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కొత్త పీఆర్సీ జీవోలతో ప్రతి ఉద్యోగి ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల మూడు ప్రధాన డిమాండ్లపై మంత్రుల కమిటీ నుంచి సమాధానం వచ్చే వరకు చర్చలకు వెళ్లేది లేదని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు తేల్చిచెప్పారు. కమిటీకి లేఖ ఇచ్చినా సమాధానం రాలేదని మండిపడ్డారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సజ్జల .. ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు.
కొత్త పీఆర్సీపీపై ఉద్యోగులకు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమచారం ఇస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు విమర్శించారు. చర్చల కోసం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూట్టూ తాము అనేక సార్లు తిరిగామన్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలే చర్చలకు రావడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా? అని బొప్పరాజు ప్రశ్నించారు. ఇంకా ఎన్ని సంఘాలను సజ్జల చీలుస్తారని దుయ్యబట్టారు.

మాకు మెచ్చూరిటీ లేదంటారా.
ఉద్యోగ సంఘాల నేతలకు మెచ్యూరిటీ లేదని మంత్రులు ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలను ఉపసంహరించుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది అసలు రాష్ట్ర పీఆర్సీనా.. కేంద్రం పీఆర్సీనా ప్రశ్నించారు. కేంద్రం 104 రకాల అలవెన్సులు ఇస్తుంది.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలదా అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications