తిరుమల పరిణామాలపై...చంద్రబాబుకు ఐవైఆర్ బహిరంగ లేఖ
అమరావతి: ఎపి మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. తిరుమల పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి టిటీడీ రిటైర్డ్ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరమని ఐవైఆర్ తన లేఖలో పేర్కొన్నారు. టిటిడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపే అధికారం ఎవ్వరికీ లేదని, పురావస్తు శాఖ తనిఖీకి, ఈ చర్యకు సంబంధం ఉండొచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
పోటు ప్రాంతంలో తవ్వకాల పైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఐవైఆర్ తన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ప్రతి వ్యవస్థ, ప్రభుత్వంలోని లోపాలను తెలిపే వ్యక్తులకు భద్రత ఉండాలని ఐవైఆర్ సందర్భంగా తన లేఖలో చంద్రబాబును కోరడం గమనార్హం. ఇదిలా వుండగా ఎపి మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు గతంలో టిటిడి ఈవోగా పనిచేసిన సంగతి తెలిసిందే.
అయితే తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి తీసుకుని తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న దాని మీద ఆ శాఖ తన పెత్తనం చలాయించాలని చూసిందంటూ ఇటీవల వివాదం రేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మొత్తానికి ఆద్యుడు ఒకప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీటీడీ ఈవో గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు అని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్న విషయం విదితమే. ఐ.వై.ఆర్ కృష్ణారావే టీటీడీని కేంద్రానికి అప్పగించాలని పలు నివేదికలు అంద చేసినట్లు టిడిపి శ్రేణులు బలంగా వాదిస్తున్నాయి. రాష్ట్రానికి తిరుమల అవసరం లేదని, కేంద్రం ఆధీనంలో ఉంచుకోవాలని టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఐవైఆర్ కృష్ణారావు ఈ వివాదాస్పద సిఫార్సులు చేయగా అప్పటిలో టిటిడి బోర్డ్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నదని టిడిపి శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిటిడి వ్యవహారాలపై ఐవైఆర్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
అనంతరం బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐవైఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి దారుణమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని మండిపడ్డారు. జీవో 76 అమలు చేస్తున్నామని ఎపి ప్రభుత్వం లీకులిస్తోందన్నారు. 1986 దేవాదాయ చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వమే సవరించిందని ఐవైఆర్ గుర్తు చేశారు. దీని వల్ల చిన్న చిన్న ఆలయాలు మూతపడ్డాయని తెలిపారు. అయితే 2007లో ఈ చట్టాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ సవరించారని చెప్పారు. 1986 చట్ట సవరణతో మిరాశీ పోయిందని, 2007 చట్ట సవరణతో మరోసారి మిరాశీ అంశంపై స్పష్టత వచ్చిందని...కానీ ఈ విషయాలను అర్ధం చేసుకోవడానికి సిఎంకు సమయమే లేకుండా పోయిందన్నారు.
బ్రాహ్మణులను బ్రాహ్మణులతో తిట్టించాలనే పాలసీలని చంద్రబాబు పెట్టుకున్నారన్నారు. కరుడుకట్టిన కులస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్ దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఆగమ పరీక్షలో ఫెయిలైన వారిని ప్రధాన అర్చకుడిగా నియమిస్తారా అని ఐవైఆర్ ప్రశ్నించారు. వారసత్వానికి కూడా సమర్ధత వుండాలన్నారు. శాతవాహన కాలేజీని ఆక్రమించేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మద్దతు రావడం దారుణమని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.