16వేల ఎకరాల భూమి: అగ్రిగోల్ట్ ఆస్తుల జఫ్తుకు ఏపీ సన్నాహాలు!
హైదరాబాద్: ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. చిట్ఫండ్స్ పేరుతో, ఇతర ఆర్ధిక అంశాలతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సంస్థల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం శనివారం జరిగింది.
ఆర్ధిక నేరాలకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలులోకి తీసుకు రాగా, అటువంటి చట్టాలనే రాష్ట్రస్థాయిల్లో కూడా అనేక రాష్ట్రాలు అమలులోకి తీసుకువచ్చాయి. ఈ చట్టం రాష్ట్రంలో అస్పష్టంగా ఉండడంతో దానిని పదును పెట్టాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం శనివారం విస్తృతంగా సమీక్షించింది. రాష్ట్ర డిజిపి, ఇంటలిజెన్స్ అదనపు డిజి, హోంశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ పోలీసు అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం త్వరలో జరిగే చట్ట సవరణలో జప్తుపై మార్పులు చేయాలని కూడా నిర్ణయించారు. అన్ని గుర్తింపు లేని నాన్ బ్యాంకింగ్ వ్యవస్థలతో పాటు, ఇటీవల వార్తల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆగ్రిగోల్డ్పై కూడా చర్చించారు. ఆగ్రిగోల్డ్కు 16వేల ఎకరాల భూమి ఉన్నట్లు సమావేశంలో వెల్లడైంది.
రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఐలాండ్తోపాటు, ఏడు రాష్ట్రాల్లో భూములు, ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. 30 లక్షల మంది నుంచి 6384 కోట్ల రూపాయలు సేకరించినట్లు అధికారులు నివేదించారు. ఒడిశా, తమిళనాడు తరహా చట్టాలు తీసుకు రావాలని నిర్ణయించినట్లు యనమల తెలిపారు.
కాగా, ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఐడీ కార్యాలయం లేదా డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఎర్పాటు చేయనున్నారు. ఆ సెల్కు సమాచారం వస్తే సుమోటోగా కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఇటువంటి కేసుల విచారణకు హైకోర్టుతో చర్చించి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటుచేయాలని, ఒకరిద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications