అమరావతిపై చంద్రబాబు ఫేక్ పోల్స్- ఆ 23 చోట్ల కూడా నమ్మడం లేదన్న సజ్జల..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారుకు అమరావతి ఆందోళనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఇప్పటివరకూ అమరావతిలో అక్రమాలపై రోజుకో విమర్శ చేస్తూ వచ్చిన ప్రభుత్వం, తాజాగా రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తున్న పోల్స్పైనా అసహనం వ్యక్తం చేసింది.
అమరావతి రాజధానిపై టీడీపీతో పాటు వివిధ టీవీ ఛానళ్లు నిర్వహిస్తున్న పోల్స్పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఈ విషయంలో టార్గెట్ చేస్తూ ఆయన ఇవాళ ట్వీట్లు పెట్టారు. ఎన్నికలు జరిగి 14 నెలలు కూడా కాలేదని, టీడీపీ గెలిచిన 23 చోట్ల కూడా చంద్రబాబు పేరు చెబితే జనం భగ్గుమంటున్నారని సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అమరావతి పేరుతో ఫేక్ పోల్స్ పెడుతున్నారని సజ్జల విమర్శించారు. మీ టీవీలు, మీ పేపర్లలో, వెబ్సైట్లలో పోల్స్ పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరికీ తెలుసంటూ చంద్రబాబుకు సజ్జల చురకలు అంటించారు.
అమరావతికి అనుకూలంగా చంద్రబాబు చేస్తున్న చివరి ప్రయత్నాలను కూడా సజ్జల తప్పుబట్టారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయాలని సజ్జల కోరారు. కుళ్లు కుతంత్రాలను, మీ మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చే పద్ధతులు మానేయాని సజ్జల చంద్రబాబుకు సూచించారు. విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషం చిమ్మవద్దని, అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబుకు సజ్జల సలహా ఇచ్చారు.