ప్రముఖ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు... మహిళలకు జగన్ భరోసా...
ఏపీ ప్రభుత్వం సోమవారం(అగస్టు 3) పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్తో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
మహిళా స్వయం సాధికారితపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఒప్పందాలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని ఆ కంపెనీలకు ఆహ్వానాలు పంపి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కంపెనీలు పెట్టే వారు ముందుకు రావాలని తాము అన్ని విధాలుగా రాయితీలు కల్పిస్తామని జగన్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. కొత్త కంపెనీల రాకతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. తాజా ఒప్పందాల సందర్భంగా జగన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అగస్టు 12న వైఎస్సార్ చేయూత...
'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించకుండా,పేదరికంలో ఉన్నవారి తలరాతలు మార్చకుండా మార్పులు సాధ్యం కావు. అలాగే మహిళల జీవితాల్లోనూ మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అగస్టు 12న వైఎస్సార్ చేయూత ప్రారంభిస్తాం.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45-60 ఏళ్లలోపు అర్హత మహిళలకు చేయూతను అందిస్తున్నాం. పూర్తి పారదర్శకంగా,విమర్శలకు తావు లేకుండా ఈ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు. ఈ పథకం కింద సుమారు రూ.4500కోట్లు ఖర్చు చేస్తున్నాం.' అని సీఎం వివరించారు.

మరిన్ని కంపెనీలు భాగస్వామ్యం కావాలని....
'ఈ కేటగిరీలోని మహిళలు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చాలాకాలంగా నిరాదరణకు గురవుతున్నారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. వైఎస్సార్ చేయూత కింద ఎంపికైన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు అందిస్తాం. ప్రభుత్వం అందించే ఈ సాయంతో వారి జీవితాలు మారాలని ఆశిస్తున్నాం. స్థిరమైన ఆదాయం ఉండే విధింగా వారికి ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటీవలే ప్రభుత్వంతో అమూల్ కంపెనీ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం ఆ మహిళలకు చేయూతనిస్తుందని,బ్యాంకు రుణాలకు గ్యారెంటీ ఇస్తుంది. కాబట్టి ఇందులో మరిన్ని కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాం.' అని చెప్పారు.

వైఎస్సార్ ఆసరా...
'సెప్టెంబరులో వైఎస్సార్ ఆసరా పథకాన్ని తీసుకురాబోతున్నాం. దీని ద్వారా 90 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరుతుంది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులైన మహిళలకు కూడా ఈ ఆసరా వర్తిస్తుంది. ఏటా దాదాపు 9 లక్షల మంది మహిళలకు రూ.6,700 కోట్లు ఆసరా కింద అందించనున్నాం. ఇలా ప్రతీ ఏటా రూ.11వేల కోట్లు చొప్పున, నాలుగేళ్ల పాటు రూ.44వేల కోట్లు దాదాపుగా కోటి మంది మహిళల అందించనున్నాం.' అని చెప్పారు.

వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా...
ఈ పథకాల ద్వారా అందించే సాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మార్చాలని ఆశిస్తున్నామన్నారు. ఆ ఆర్థిక సాయం వారికి స్థిరమైన ఆదాయాలు ఇచ్చే,స్థిరమైన ఉపాధి మార్గాన్ని కల్పించేదిగా మారాలన్నారు. వ్యవస్థలో దిగువన ఉన్నవారికి ఇది చేయూతనిస్తుందని... వారి కాళ్లపై వాళ్లను నిలబడేలా చేస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications