విశాఖ పోలీసు కమిషనర్ గా శ్రీకాంత్ - 26 జిల్లాలకు కొత్త కలెక్టర్లు- ఎస్పీలు : భారీగా బదిలీలు..!!
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా కొత్తగా 13 జిల్లాలు అందుబాటులోకి వస్తున్నాయి. 4వ తేదీ నుంచి ఈ జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. దీంతో..కొత్త జిల్లాలకు కలెక్టర్లు - ఎస్పీలతో పాటుగా జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులను సైతం బదిలీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురు తప్ప మిగతా 9 మందినీ వారు పని చేస్తున్న చోటే కలెక్టర్లుగా కొనసాగించింది.
కొత్త జిల్లాలు - కొత్త పోస్టింగులు
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా ఉన్న వివేక్ యాదవ్, నివాస్, ప్రవీణ్ కుమార్, హరికిరణ్లను రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో జేసీ (హౌసింగ్), జేసీ (గ్రామ, వార్డు) సచివాలయాలుగా పని చేస్తున్న వారిలో పలువురిని కొత్త జిల్లాలకు జేసీలుగా నియమించింది. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధానంగా ప్రస్తుతం విశాఖ కమిషనర్గా ఉన్న మనీశ్ కుమార్ సిన్హాను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నియమించింది. విశాఖ పోలీస్ కమిషనర్గా శ్రీకాంత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హరీశ్ కుమార్ గుప్తాను రైల్వే డీజీగా బదిలీ చేసింది.
ఐపీఎస్ అధికారుల బదిలీలు..
శ్రీకాకుళం ఎస్పీగా ఉన్న అమిత్ బర్దార్ను సీఐడీ ఎస్పీగా నియమించింది. డి.నరసింహకిషోర్ను ఇంటిలిజెన్స్ నుంచి బదిలీ చేసి టిటిడి విజిలెన్స్కు బదిలీ చేశారు. జెన్కో ఎస్పీగా టి.పననరెడ్డిని నియమించారు. విశాఖపట్నం రూరల్ ఎస్సీగా ఉన్న బి.కృష్ణారావును ఏసీబీలో ఎస్పీగా బదిలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను రైల్వేస్ ఎస్పీగా బదిలీ చేశారు. ఎస్ఈబీ కమిషనర్గా ఉన్న వినీత్ బ్రిజలాల్ను ఎస్ఐబీ ఐజీగా నియమించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రవి శంకర్ అయ్యన్నార్ కు ఎస్ఐబీ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది.
ఇక, సీనియస్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. వాణా శాఖ కమిషనర్గా కాటమనేని భాస్కర్ను, సీఆర్డీఏ కమిషనర్గా వివేక్ యాదవ్ను, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్గా చేవూరి హరికిరణ్ను, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్గా జె.నివాస్ను, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ఆర్.బిహెచ్.ఎన్.చక్రవర్తిని నియమించింది.
సీనియర్ ఐఏఎస్ లకు కొత్త బాధ్యతలు
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జి.వాణీమోహన్ను యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహార్లాల్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్గా వీరపాండ్యన్కు అదనపు బాధ్యతలు అప్పగింది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా జాహ్నవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్గా చేతన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ..మొత్తంగా అధికార యంత్రంగాన్ని సైతం సిద్దం చేసిన ప్రభుత్వం.. 4వ తేదీ నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల పాలన అందించేందుకు సర్వం సిద్దం చేస్తోంది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ సైతం జిల్లాల వారీగా జారీ చేసారు.