చింతామణి, సుబ్బిశెట్టి..ఇక కనిపించరు: నాటక ప్రదర్శనపై ఏపీ ప్రభుత్వం నిషేధం: రోశయ్య హయాంలో
అమరావతి: దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సాధించిన చింతామణి నాటక ప్రదర్శనను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్రంలో ఈ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించినా.. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. వేశ్యావృత్తిని కథాంశంగా తీసుకుని రూపొందించిన నాటకం ఇది.
దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన నాటకంగా..
20వ దశాబ్దంలో అప్పటి సామాజికాంశాలు, వేశ్యావృత్తి, అందులోని ఇబ్బందులు, దాని వల్ల ఉత్పన్నమౌతున్న సమస్యల ఆధారంగా కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పర్వదినాలతో పాటు స్థానికంగా జరిగే జాతరల సందర్భంగా ఇప్పటికీ ఈ నాటకం ప్రదర్శితమవుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా 446 సార్లు చింతామణి నాటకం ప్రదర్శితమైంది. చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, చిత్ర వంటి పాత్రల పేర్లు తెలుగునాట నాటుకుపోయాయి.
చింతామణి, సుబ్బిశెట్టి..
ఇందులో చింతామణి, సుబ్బిశెట్టి అనే పాత్రలు కీలకం. చింతామణి అనే వేశ్య వ్యామోహంలో పడి సుబ్బిశెట్టి తనకు ఉన్న ఆస్తులన్నింటినీ పోగొట్టుకుంటాడు. ఈ క్యారెక్టర్.. ఆర్యవైశ్యులను దృష్టిలో పెట్టుకుని రచించారని, ఇప్పటి సమకాలీన పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా వినిపిస్తోంది. సుబ్బిశెట్టి పాత్ర తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని, దీన్ని నిషేధించాలంటూ ఆర్యవైశ్య మహాసభ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నిషేధం పట్ల సానుకూలంగా..
దీని పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీన్ని నిషేధించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుండా నిషేధించారు. ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాటకాన్ని తొలిసారి మచిలీపట్నంలోని రామమోహన నాటక సంఘం ప్రదర్శించింది. 1923 నాటికే సుమారు దేశవ్యాప్తంగా 446 సార్లు ఈ నాటకం ప్రదర్శితమైంది.
రోశయ్య హయాంలో..
ఈ నాటకాన్ని నిషేధించడానికి ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రయత్నాలు సాగాయి. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిషేధించడానికి జీవోను కూడా తీసుకొచ్చారని, అది పెద్దగా అమలు కాలేదని చెబుతున్నారు. అదే డిమాండ్ను మళ్లీ తెర మీదికి తీసుకుని రావడం, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా ఒత్తిడిని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.
మిశ్రమ స్పందన..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. ఆర్యవైశ్య సామాజిక వర్గం స్వాగతించింది. నిషేధించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం నుంచి తాము ఈ డిమాండ్ను వినిపిస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెబుతున్నాయి. చింతామణి నాటకాన్ని నిషేధించడం పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఒక సందేశాత్మక నాటకాన్ని నిషేధించడం సరికాదని అంటున్నారు. ఈ నాటకంలోని సామాజిక స్ఫూర్తిని స్వీకరించాలే తప్ప.. ఒక కులాన్ని కించపరిచినట్లుగా భావించకూడదనే అంటున్నారు.