ఏపీలో టెన్త్ క్లాస్ పేపర్ లీక్-వాస్తవమెంత ? ప్రభుత్వం క్లారిటీ ఇదే
ఏపీలో ఇవాళ ప్రారంభమైన పదో తరగతి పరీక్షల సందర్భంగా పేపర్ లీక్ అంటూ పుకార్లు వ్యాపించాయి. పలు జిల్లాల్లో పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్ లో పేపర్ కాపీలు సర్కులేట్ కావడంతో ఇది నిజమేనన్న ఆందోళన కూడా అభ్యర్ధుల్లో వ్యక్తమైంది. అయితే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.
10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కొన్ని సోషల్ మీడియా, ఛానెళ్లలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ఈ సమాచారం పూర్తిగా తప్పని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో ఎవరో 10వ తరగతి ప్రశ్నపత్రం, పరీక్షా కేంద్రంలోని ఫోటోలు సర్క్యులేట్ చేయడం ప్రారంభించినట్లు తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనందున, దానిని లీక్ అని చెప్పలేమని, ఇది ఎవరో సృష్టించిన పుకారు అని స్పష్టంగా తెలుస్తోందన్నారు.
నంద్యాల జిల్లా కొలిమగుండ్ల మండలం జడ్పీహెచ్ఎస్ అంకిరెడ్డి పల్లి కేంద్రంగా ఈ పేపర్ సర్కులేట్ అయినట్లు ఇప్పటికే గుర్తించామని అధికారులు తెలిపారు. బాధ్యులను గుర్తించి అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన చీఫ్ సూపర్వైజర్, ఇన్విజిలేటర్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో నోడల్ అధికారులు, ఆర్జేడీలు, డీఈఓలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పరీక్షా కేంద్రం నిబంధనలో మొబైల్ ఫోన్ వద్దు అనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ (ఇన్విజిలేటర్లు, ఇతరులు) మొబైల్లను చీఫ్ సూపర్వైజర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా ఫిరాయింపులు జరిగితే సీఎస్ బాధ్యత వహించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.