ఏపీలో వినాయక చవితి పందిళ్లకు నో- సర్కార్ నిర్ణయం- అభ్యంతరాలు బేఖాతర్..
ఏపీలో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్ధితులపై సాధారణ పరిపాలనశాఖ, పోలీస్, వైద్యశాఖతో లోతుగా సమీక్ష నిర్వహించిన తర్వాత బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఈ ఏడాది రోడ్లపై వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఆంక్షలు ఉల్లంఘించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం తాజా ఆదేశాల్లో బహిరంగ ప్రదేశాలకు బదులుగా ఇళ్ల వద్దే ప్రజలు వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించింది. అలాగే పండుగ సామాగ్రి కొనేటప్పుడు మార్కెట్లోనూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలపై ఆంక్షలు ఉన్నందున చవితి సామాగ్రి కొనుగోలుకు ప్రజలు మార్కెట్లో ఎగబడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో మార్కెట్లలోనూ తప్పనిసరిగా ఆంక్షలు అమలు చేస్తారు.
మరోవైపు ఏపీలో వినాయక చవితి వేడుకలను అడ్డుకోవద్దని విపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే డిమాండ్ చేసింది. చవితి వేడుకలను మతం కోణంలో చూడొద్దంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కానీ ప్రస్తుతం కరోనా పరిస్ధితుల్లో వేడుకలకు అనుమతిస్తే వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.