ఉద్యోగ సంఘాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని విమర్శలు ఎదుర్కుంటున్నప్పటికీ వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటనిస్తూ ఇవాళ మెమో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ ఈ మేరకు ఊరట లభించబోతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకూ సడలిస్తున్నట్లు పేర్కొంది. ఎక్సైజ్ శాఖ మినహా 14 శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో తెలిపింది. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకూ బదిలీలకు అవకాశం కల్పించారు.

తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌరసరఫరాలు, మైనింగ్, జియాలజీ, అన్ని శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయశాఖ, రవాణా శాఖ, ఈఎఫ్ఎస్ అంట్ టీ, పరిశ్రమలు, విద్యుత్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు మొదలయ్యాయి. అయితే వీటిలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లను మినహాయిస్తూ ప్రభుత్వం ఇవాళ మెమో విడుదల చేసింది. ఇందులో అన్ని శాఖల విభాగాధిపతులు ఆయా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుంచి ఏడురకాల పత్రాలను తీసుకుని వీరికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొంది. ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీస్ బేరర్లు తమ గుర్తింపును నిరూపించుకునేలా ఈ పత్రాలను తమ శాఖల విభాగాధిపతులకు సమర్పిస్తే బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.












Click it and Unblock the Notifications