ఏపీలో ఇళ్లు కట్టుకునేవారికి మరో వరం ప్రకటించిన చంద్రబాబు
జూన్ నాలుగోతేదీన ఏపీలో బాధ్యతలు చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చినవాటిని అమలుచేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఉచితంగా ఇసుక విధానం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోపే ఇసుకపై నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోన్న సంగతి తెలసిందే. ఇటీవలే చంద్రబాబు రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక పాలసీని సమీక్షించారు.
అధికారులు స్లాట్ కేటాయిస్తారు
ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఇసుక కావాల్సినవారు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ పై అవగాహన లేనివారు తమకు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోను కావాల్సిన పరిమాణంలో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి ఎప్పుడు వస్తుందనేది తెలియజేస్తూ అధికారులు స్లాట్ కేటాయిస్తారు.

ఫిర్యాదులుంటే ఫోన్ చేయవచ్చు
ఇసుకను అక్రమంగా రావాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నదుల్లో నుంచి, వాగుల నుంచి, వంకల నుంచి ప్రజలు ఇసుకను ఉచితంగా ఎడ్ల బండ్లల్లో తరలించుకెళ్లొచ్చు. అలా తీసుకువెళ్లిన ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా? లేదంటే అక్రమాలకు పాల్పడుతున్నారా? అనే విషయంలో ప్రభుత్వం నిఘా పెడుతుంది.
ఇసుకను తీసుకువెళ్లేందుకు వినియోగదారులు తమ సొంత వాహనాల్లో లేదంటే ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాలద్వారా తీసుకువెళ్లవచ్చు. ఇసుక రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు 1800-599-4599 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.












Click it and Unblock the Notifications