Amaravati: ఇంగ్లీష్ మీడియంపై మరో ముందడుగు: ప్రత్యేక ప్రాజెక్టు..ఐఎఎస్ ర్యాంకర్ కు బాధ్యతలు
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేక అధికారిణిగా ఐఎఎస్ టాపర్ కే వెట్రిసెల్విని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజ్యసభను తాకిన ఇంగ్లీషు మీడియం రచ్చ: నిర్ణయం మార్చుకోవాలి: కేంద్రం సూచించాలి..!
ప్రస్తుతం వెట్రిసెల్వి.. భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేస్తున్నారు. భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో ప్రధాన విభాగాల్లో ఒకటైన షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని భూముల కంప్యూటరీకరణ, అసైన్ మెంట్ భూముల పర్యవేక్షణ, సర్వే విభాగం ప్రాజెక్టు డైరెక్టర్గా వెట్రిసెల్వి పని చేస్తున్నారు. ఆమెను అక్కడి నుంచి బదిలీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు ప్రత్యేకాధికారిగా నియమించారు.
దీనితో పాటు పాఠశాల విద్యాశాఖ ఎక్స్ అఫీషియో సంయుక్త కార్యదర్శిగా కూడా ఆమె వ్యవహరిస్తారు. రాష్ట్రంలో 15 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కొనసాగుతుంది.
దీనికి సంబంధించి, పాఠ్య పుస్తకాల ముద్రణ మొదలుకుని వసతుల కల్పన, పాఠశాలలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులకు మధ్యంతర శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం చేపట్టబోతోంది. ఆయా కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన ఎలా సాగుతోందన్న విషయాలను పర్యవేక్షించడం వరకు మాత్రమే దీని బాధ్యత.
తమిళనాడుకు చెందిన వెట్రి సెల్వి 2014 బ్యాచ్ ఏపీ క్యాడర్ అధికారిణి. తన బ్యాచ్ లో ఆమె ర్యాంకర్. 142 ర్యాంక్ తో ఆమె సివిల్స్ ను సాధించారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత రాష్ట్రంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ గా పేరున్న మదనపల్లికి సబ్ కలెక్టర్ గా పని చేశారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం ఉండటం, క్షేత్రస్థాయిలో పరిపాలన యంత్రాంగంపై వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది.