US-Iran War: తీవ్రస్థాయికి అమెరికా-ఇరాన్ వార్..! సై అంటే సై..!
అమెరికా-ఇరాన్ (US-Iran)మధ్య మరోసారి సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇరాన్ పై భారీ దాడులకు అమెరికా సైన్యానికి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మొదలైన ఈ మాటల యుద్దం ఇవాళ పతాకస్దాయికి చేరింది. ఇరాన్ పై సైనిక చర్యలను విస్తరించే అవకాశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారని అమెరికా నుంచి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో.. ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తోంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ నుండి తాజాగా సైనిక చర్య ఎదురైతే.. గల్ఫ్ ప్రాంతంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఘాటు వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలను ఒక రకమైన పిచ్చి గా ఆ దేశ భద్రతాధికారి ఒకరు అభివర్ణించారు. టెహ్రాన్ ఇప్పటికే విస్తృత ప్రతీకార ప్రణాళికలను సిద్ధం చేసిందని, ఏ దాడి జరిగినా దానికి ప్రతిగా ఇజ్రాయెల్లోని కీలక మౌలిక సదుపాయాలపై, అలాగే ఈ ప్రాంతంలోని అమెరికా ఇంధన ఆస్తులపై దాడులు చేస్తామని ఆ ఆయన హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది.

గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, శత్రుత్వాన్ని తీవ్రతరం చేస్తోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆరోపించిన నేపథ్యంలో టెహ్రాన్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ట్రంప్ ఈ ఉగ్రవాద చర్యను చూస్తూ ఊరుకోరని లీవిట్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అర్థవంతమైనదిగా భావించే రీతిలో ఇరాన్ చర్చలకు వచ్చే వరకు మూల్యం చెల్లించుకుంటూనే ఉంటుందని తేల్చేసారు. మరోవైపు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. మరో నాలుగు ట్యాంకర్లు తమ మార్గాన్ని మార్చుకుని వెనుదిరిగాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.














Click it and Unblock the Notifications