మీరు చెప్పిందే చేశాను- నిమ్మగడ్డ ఫిర్యాదులేంటి- సర్కారును ఇరుకునపెట్టిన ప్రవీణ్ ప్రకాష్
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికీ, ఎన్నికల సంఘానికీ మధ్య జరుగుతున్న పోరులో అధికారుల పాత్ర ఎలా తయారైందన్న అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో తన ఆదేశాలు పాటించని అధికారులపై ఒక్కొక్కరిగా ఫిర్యాదులు చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్, గవర్నర్ను కోరుతున్నారు. అయితే వారి చర్యల సంగతి పక్కనబెడితే వారు ఇస్తున్న వివరణలు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిమ్మగడ్డపై పోరు సాగిస్తున్నప్పుడు మేం మాత్రం అతీతులా అన్న వాదన వీరి మాటల్లో ధ్వనిస్తోంది. తాజాగా సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సీఎస్కు రాసిన లేఖ ఇందుకు ఉదాహరణ.
ఎస్ఈసీ, సర్కార్ పోరులో నలిగిపోతున్న అధికారులు
పంచాయతీ ఎన్నికలకు ముందే స్ధానిక ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే విషయంలో వైసీపీ ప్రభుత్వానికీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య మొదలైన పోరులో పలువురు అధికారులు ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎస్ఈసీని కాదని పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా కూడా తయారు చేయకుండా వదిలేశారు. కానీ ఎన్నికల సంగ్రామం మొదలయ్యే నాటికి ఎస్ఈసీకి వివరణ ఇచ్చుకోలేని పరిస్ధితుల్లో వారే నలిగిపోతున్నారు. చివరికి తమపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికే మొరపెట్టుకోవాల్సిన పరిస్ధితి. బిజినెస్ రూల్స్ పాటించకుండా అధికార పార్టీకి మద్దతిచ్చిన వీరిపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తేలలేదు.
ఎస్ఈసీతో పోరులో ప్రవీణ్ ప్రకాష్ వంతు
నిమ్మగడ్డతో ప్రభుత్వం సాగిస్తున్న పోరులో ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఐఏఎస్లు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్ చిక్కుకున్నారు. వీరిపై అభిశంసన చర్యలకు నిమ్మగడ్డ చేసిన సిఫార్సును ప్రస్తుతానికి జగన్ సర్కారు తిరస్కరించినా అఖిల భారత సర్వీసు అధికారులు కాబట్టి భవిష్యత్తులో కేంద్రం చెబితే మాత్రం తప్పకుండా వినాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే క్రమంలో సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కూడా బాధితుడిగా మారారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్కు వారిని వెళ్లొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం సమస్యగా మారింది. ఈ ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిమ్మగడ్డ నిన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాశారు.
ప్రభుత్వం చెప్పిందే చేశానన్న ప్రవీణ్ ప్రకాష్
నిమ్మగడ్డతో వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్లు, ఎస్పీలను వెళ్లొదని చెప్పడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా తాను పంపిన లేఖకు సమాధానం ఇవ్వలేదని ప్రవీణ్ ప్రకాష్పై నిమ్మగడ్డ సీఎస్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే తాను నడుచుకున్నట్లు చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ యతాతథ స్ధితి కొనసాగించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను వారిని వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాకుండా ఆదేశాలు ఇచ్చినట్లు ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం చెప్పినట్లే తాను నడుచుకున్నానని, తనపై చర్యలు తీసుకోవాలో వద్దో మీరే నిర్ణయించుకోవాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు ప్రవీణ్ ప్రకాష్ చెప్పేశారు.
ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యలతో సర్కారుకు ఇరకాటం
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ అధికారులను కూడా సుప్రీం తీర్పు వచ్చే వరకూ యతాతథ స్ధితి పాటించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాను అధికారులను ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావొద్దని చెప్పినట్లు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ బయటపెట్టారు. దీంతో ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు మాత్రమే తాను పాటించానన్నారు. దీంతో ఇప్పటికే హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లోనూ ఈ విషయాన్ని ఎస్ఈసీ లేవనెత్తనున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారులను ఎస్ఈసీతో సమావేశం కాకుండా అడ్డుకున్న విషయంలో ప్రభుత్వం ఇరుకునపడే అవకాశముంది.