ఏపీలో జిల్లాల సంఖ్య పెంపు - ఎక్కెడక్కడ..!?
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా పరంగా కొత్త అంశాల పై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పలు జిల్లాల ఏర్పాటు పైన నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల కూర్పు పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 5-6 వరకు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది.
ఎన్నికల హామీ
ఏపీలో అధికారంలోకి వస్తే జిల్లాల ఏర్పాటు పైన నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మూడు జిల్లాల ఏర్పాటు..ప్రకాశంలోనూ హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావటంతో కొత్త జిల్లాల ఏర్పాటు పైన అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం, అమరావతి సందర్శించారు. ఇక..పాలనా పరంగా నిర్ణయాల అమలు దిశగా ఈ నెల 24న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుంది.

జిల్లాల పునర్విభజన
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కో పార్లమెంట్ ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీటిని కొనసాగిస్తూనే కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొత్తగా అయిదు జిల్లాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడే జిల్లాలుగా పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్ల పల్లె నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉంది.
ప్రజాభిప్రాయంతోనే నిర్ణయం
బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజంపేట జిల్లా ఏర్పాటు కు ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు అవుతుందని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, పూర్తి స్థాయిలో సాంకేతికంగా, క్షేత్ర స్థాయిలోనూ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని జిల్లాల పునర్విభజన పైన నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే జిల్లాల విషయంలో తుది నిర్ణయం ఉంటుందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications