కొత్త జిల్లాల వ్యూహం వెనుక- కేంద్ర ఉత్తర్వులు అమల్లో ఉండగా : లక్ష్యం అదేనా..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కొత్తది కాదు. గతంలోనే దీనికి సంబంధించి సీఎస్ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసారు. అయితే, ఇప్పుడు ప్రక్రియను మాత్రం వేగవంతం చేసారు. దాదాపు కసరత్తు ఒక కొలిక్కి తెచ్చారు. ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా కొత్త జిల్లాలపైన నోటిఫికేషన్ జారీ చేస్తూ..కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది.
ప్రభుత్వ వేగానికి కారణమేంటి
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా.. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలిపారు. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసులను జిల్లా కలెక్టర్లకు పంపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లందరూ ఆమోదం తెలిపారు. ఇంకా ఏవైనా అంశాలుంటే తుది నోటిఫికేషన్ ఇచ్చేలోగా తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
ప్రభుత్వ వ్యూహం పైన చర్చలు
1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అయితే, ఇదే అంశం పైన కేంద్రం గతంలోనే ఇచ్చిన ఉత్తర్వుల అంశం తెర పైకి వస్తోంది. ఆ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జనాభా గణనకు కేంద్రం 2020 జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్(నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది. సెన్సస్ డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీజింగ్ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు.
కేంద్ర ఉత్తర్వులు అమల్లో ఉన్నా
కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. అయితే, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన కసరత్తును అనధికారికంగా చేపట్టవచ్చు. అందుకు సంబంధించిన అధ్యయనం చేయవచ్చు. అధికారికమైన ఉత్తర్వులు జారీ చేయడానికి మాత్రం వీల్లేదు. కానీ, ప్రభుత్వం నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న వేల..సాంకేతికంగా సమస్యలు తలెత్తుతాయా అనే ప్రశ్న మొదలైంది. ఇక, ఇదే సమయంలో మరో వాదన ముందుకు వచ్చింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అంశం ఈ సమయంలో అమలు దిశగా ముందుడుగు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రజాభిప్రాయ సేకరణ తరువాతనే
కొత్త జిల్లాల ఏర్పాటు.. మండలాలు - రెవిన్యూ డివిజన్లలో మార్పులు.. కొత్తవి ఏర్పాటు..వంటి వ్యవహారాలతో లోక్సభ నియోజకవర్గం ప్రాతిపదికన జరిగే జిల్లాల విభజన తమపై పడే ప్రభావంపై చర్చలు మొదలవుతాయి. ప్రజా సంఘాలు, పార్టీలు అభ్యంతరాలు, సూచనలు సమర్పించడంపై దృష్టి సారిస్తాయి. తమ మండలం ఆ జిల్లాలోనే ఉండాలంటూ.. తమ నియోకవర్గాన్ని తమ జిల్లాలోనే ఉంచాలంటూ కొన్ని చోట్ల డిమాండ్లు మొదలయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో జిల్లా సరిహద్దుల్లో పని చేసే ఉద్యోగులు జిల్లా మార్పు ఉంటుంది. స్థానికత.. జోనల్ పోస్టుల్లో ఇప్పుడు మారుతున్న జిల్లా సరిహద్దులు..ఆ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నియామక ఉత్తర్వుల్లో మార్పులు పైన కొంత చర్చ జరిగే అవకాశం ఉంది.
ఉద్యోగులపై ప్రభావం ఉంటుందా
ఉద్యోగుల పైన ఎటువంటి ప్రభావం ఉంటుందనే దాని పైన స్పష్టత రావాల్సి ఉంటుండి. దీంతో..ప్రస్తుతం సమ్మె దిశగా అడుగులు వేస్తున్న ఉద్యోగ సంఘాలు ఈ జిల్లాల ఏర్పాటు.. మార్పులు - చేర్పులతో వాటి వైపు ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. అయితే, ఉద్యోగులు సహకరించకుండా ఈ కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి చేయటం సైతం అంత సులువైన అంశం కాదు. దీంతొ..ప్రభుత్వ వ్యూహాలు.. కేంద్ర ఆదేశాలు.. ఉద్యోగుల కార్యాచరణ.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలతో అసలు ఈ కొత్త జిల్లాల ప్రక్రియ ఏ టర్న్ తీసుకుంటుందనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.