పెన్షన్ల పంపిణీలో కీలక మార్పు - ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను ప్రభుత్వం రూ 4 వేలకు పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఇంటి వద్ద కు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. అనర్హులకు పెన్షన్ల పైన అధ్యయనం జరుగుతోంది. అర్హులకు కోత ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో జనవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కేటగిరీల పెన్షన్లు పెంచి అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతీ ఇంటికి ఒకటో తేదీనే అందేలా అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు సహా, మంత్రు లు..ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకటో తేదీ సెలవు ఉంటే ముందు రోజునే పెన్షన్ల పంపిణీ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తోంది.

పెన్షన్లు పెంపు - అమలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తోంది. ఇందులో భాగంగా వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులకు నెలకు 4000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ, తలసీమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు రూ, 15,000లకు పెంచి పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.2,700 కోట్లను ఖర్చు చేస్తోంది.
పల్నాడుకు సీఎం
జనవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 1 వ తేదీ ఇచ్చే ఫించను డిసెంబర్ 31 కి మార్పు చేసి.. అదే రోజు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 1 కొత్త సంవత్సరం కావటంతో ముందుగానే పంపిణీ గురించి కసరత్తు జరుగుతోందని సమాచారం. ఈ మేరకు డిసెంబర్ 30 వ తేదీ న బ్యాంక్ లో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఈ సారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పాల్గొనాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications