AP Roads: ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్..!
ఏపీలో జాతీయ రహదారులతో సమానంగా రాష్ట్ర రహదారులు సైతం టోల్ బాదుడుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన రహదారులను అభివృద్ధి చేసి వాటిపై టోల్ మోత మోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ముందుగా 16 నగరాల్లో రోడ్లను ఎంపిక చేశారు. వాటిని అభివృద్ది చేసేందుకు అధికారులు రెడీ చేసిన ప్లాన్ కు త్వరలో ప్రభుత్వం ఆమోదముద్ర వేయబోతోంది. అనంతరం టెండర్లు పిలుస్తారు.
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల (కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) పరిధిలో రోడ్లను పీపీపీ విధానంలో ( కాంట్రాక్టర్ రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడం) అభివృద్ధి చేసేందుకు అధికారుల ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా 16 నగరాల్లో ఉన్న 642.90 కిలోమీటర్ల మేర రోడ్లను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి, నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తారు. అనంతరం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పని ప్రారంభిస్తారు.

రాష్ట్రంలో ఇలా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన మొత్తం 642.90 కిలోమీటర్ల రోడ్లలో విశాఖపట్నంలోనే అత్యధికంగా 253.05 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరులో 83 కిలోమీటర్లు, గుంటూరులో 60 కిలోమీటర్లు, కాకినాడలో 39 కిలోమీటర్లు, విజయనగరంలో 33 కిలోమీటర్లు, చిత్తూరులో 29 కిలోమీటర్లు, కడపలో 28 కిలోమీటర్లు, అనంతపురంలో 21 కిలోమీటర్లు, తిరుపతిలో 19 కిలోమీటర్లు, విజయవాడలో 17 కిలోమీటర్లు, శ్రీకాకుళంలో 12 కిలోమీటర్లు, మచిలీపట్నంలో 11 కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే కర్నూలు,, రాజమండ్రిలో 7 కిలోమీటర్ల చొప్పున, ఏలూరులో 5 కిలోమీటర్లు ఉన్నాయి.
వీటిని కాంట్రాక్టర్లకు టెండర్ విధానంలో కట్టబెడతారు. అనంతరం కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణంతో పాటు పదేళ్ల పాటు దాని నిర్వహణ చూడాల్సి ఉంటుంది. మధ్యలో రిపేర్లు వచ్చినా వారిదే బాధ్యత. అలాగే వీటిపై టోల్ ట్యాక్స్ తో పాటు ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశం వారికి కల్పిస్తారు.












Click it and Unblock the Notifications