టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించిన ఏపీ ప్రభుత్వం
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి టీటీడీ బడ్జెట్లో ఒక శాతం నిధి కేటాయించాలని టీటీడీ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు టీటీడీ ఈవోకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ మెమో ఇచ్చారు.
ఇటీవల జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుపతి నగర అభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్లో ఒక శాతం కేటాయించి ఓ ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ధార్మిక సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది. కాగా, ప్రభుత్వం వెనుకడుగు భక్తుల విజయమన్నారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి.

గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
గజ వాహనం - కర్మ విముక్తి
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications