ఏపీలో వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల్లో ఊరట..! గ్రామాల్లో మాత్రం..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ విషయంలో ఏం చేయాలో కూటమి సర్కార్ కు పాలుపోవడం లేదు. నిన్న మొన్నటి వరకూ సచివాలయాల హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ పేరుతో పలు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు బదిలీల విషయంలో రోజుకో నిర్ణయం తీసుకుంటోంది.. దీంతో ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరటనిచ్చింది.
కూటమి ప్రభుత్వం తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఇందులో ఇప్పటికే బదిలీలకు మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిలో గ్రామ సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదని, వార్డు సచివాలయ ఉద్యోగులు సొంత మున్సిపాలిటీల్లో పనిచేయకూడదని నిబంధన విధించింది. అంటే ఇతర మండలాలకు వీరిని బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

సొంత మండలాల్లో, మున్సిపాలిటీల్లో పనిచేయకుండా ప్రభుత్వం పెట్టిన నిబంధనను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎత్తేయాలని మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు సొంత మున్సిపాలిటీల్లో పనిచేయకూడదనే నిబంధనను సవరించి సొంత వార్డులో పనిచేయకూడదంటూ ప్రభుత్వం ఇవాళ దాన్ని సవరించింది.
వార్డు సచివాలయ ఉద్యోగులు కేవలం సొంతవార్డులో మాత్రమే పనిచేయకూడదని 5 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన ఉద్యోగులు వారి సొంత వార్డు కాకుండా అదే మున్సిపాలిటీలో వేరే వార్డుకు మారవచ్చునని తెలిపింది. దీంతో వారికి ఊరట లభించినట్లయింది. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాత్రం సొంత మండలాల్లో పనిచేయకుండా ఇచ్చిన నిబంధనను మాత్రం తొలగించలేదు. దీంతో వీరికి ఇతర మండలాలకు బదిలీలు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications