ఏపీలో అమ్మఒడికి రేషన్ కార్డుల దెబ్బ- ఈసారి 8 లక్షల మందికి కట్- జనం గగ్గోలు
ఏపీలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించాలనే తపన ఈసారి భారీ సంఖ్యలో లబ్దిదారులకు ఇబ్బందులు సృష్టించబోతోంది. తాజాగా అర్హత లేకపోయినా వాడుకలో ఉన్న 8 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం తొలగించింది. వీరంతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, లేక ఆస్తులు కలిగిన వారో, ఇతరత్రా కారణాలతోనే ముడిపడి ఉన్నారు. వీరి తొలగింపును సమర్ధించుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు అమ్మఒడి పథకంలో చెల్లింపుల సందర్భంగా వీరిని బుజ్జగించాల్సి రావడం సమస్యగా మారుతోంది. రేషన్ కార్డు తొలగింపు కారణంగా అమ్మఒడి పథకానికి అనర్హులుగా మారిన వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
జనవరిలో అమ్మఒడి రెండో విడత
ఏపీలో అక్షరాస్యతను పెంచే లక్ష్యంతో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల రూపాయలు జమచేసేలా ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాలను ప్రభుత్వం జమచేసింది. వచ్చేనెలలో ఏడాది పూర్తయిన సందర్భంగా రెండో విడత డబ్బులు జమచేసేందుకు ప్రభుత్వం నిధుల సేకరణలో బిజీగా ఉంది. జనవరి 26న అమ్మఒడి పథకంలో భాగంగా రెండోసారి రూ.15 వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఈసారి పథకంలో భాగంగా ఉన్న లబ్దిదారుల జాబితాలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.
అమ్మఒడిపై రేషన్ కార్డుల దెబ్బ...
అమ్మఒడి పథకానికి అర్హత సాధించాలంటే సదరు విద్యార్ధి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డుల ఆధారంగానే లబ్దిదారులను పేదలుగా గుర్తిస్తూ వారికి అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తాజాగా అనర్హుల పేరుతో 8 లక్షల మందికి రేషన్ కార్డులను రద్దు చేసింది. ఈ లెక్కన చూసినప్పుడు ఆ 8 లక్షల మందికి అమ్మఒడి పథకానికి కూడా అనర్హులుగా మారారు. దీంతో ఇప్పుడు వారంతా అమ్మఒడి పథకానికి దరఖాస్తు చేసుకుంటుండగా.. వారికి అధికారుల నుంచి ప్రతికూలత ఎదురవుతోంది. రేషన్ కార్డులు లేకుండా అమ్మఒడి ఎలా ఇస్తామంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
రేషన్ కార్డుల్లేకుండా అమలు చేస్తారా?
వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు అనేది బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు ఓ సాధనంగా ఉపయోగపడుతోంది. ప్రభుత్వాలు కూడా తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. తెల్లకార్డును వదిలేసి సంక్షేమ పథకాలు ఇస్తే అవి అనర్హులకు చేరతాయనే ఆందోళన ప్రభుత్వాలకు ఉంటుంది. ఈసారి అమ్మఒడి పథకానికి సైతం రేషన్ కార్డులే ఆధారం. అటువంటప్పుడు రేషన్ కార్డుల్లేకుండా ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అవునని చెప్పలేని పరిస్దితి. దీంతో 8 లక్షల మంది తల్లులు ఈసారి అమ్మఒడి పథకానికి దూరం కానున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం కూడా ఏ హామీ ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉంది.
అమ్మఒడిలో కోతలపై పేదల ఆగ్రహం
ఇప్పటికే రాష్ట్రంలో అమ్మఒడి పథకం అమలుకు వివిధ కారణాలతో నిరాకరిస్తున్న పరిస్దితులున్నాయి. ఇందులో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు. గతంలో దాఖలు చేసి ఇప్పుడు దాఖలు చేయకపోయినా నిరాకరిస్తున్న వారు, తల్లి బ్యాంకు ఖాతా లేదనే కారణంతో నిరాకరిస్తున్న వారు, ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ల పేరుతో నిరాకరణలు, తల్లితండ్రులు లేని అనాథలై ఈ పథకానికి దూరమవుతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి ఇవేవీ పట్టని పరిస్దితి. అధికారులు చెప్పినట్లు ఆడుతూ లబ్దిదారులను కీలక పథకానికి దూరం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.