మూడు రాజధానుల విషయంలో అఖిలపక్ష భేటీకి సర్కార్ నిర్ణయం... రీజన్ ఇదే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన ఏపీలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. మూడు రాజధానిని ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా ప్రకటన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క జి ఎన్ రెడ్డి కమిటీ రాజధాని ప్రాంతంలో పర్యటించే లేదని రాజధాని ప్రజల అభిప్రాయాలను సైతం తెలుసుకోలేని, రాజధాని రైతుల నుండి ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఏపీకి మూడు రాజధానులతో ఆర్ధిక భారం పెరగదా ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై విమర్శలు
కమిటీ నివేదిక సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆగ్రహ జ్వాలలు మిన్నుముట్టాయి. రాజధానిలోని 29 గ్రామాలలో నిరసనల పర్వం కొనసాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మార్చుకోవాలని లేదంటే ఢిల్లీ వరకు వెళ్లి ఉద్యమిస్తామని రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం రాజకీయ కక్షలతోనే అమరావతి రైతులకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది .
ఏకపక్ష నిర్ణయం అని ఆరోపణలకు చెక్ పెట్టే ప్లాన్
ఇక ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయమని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆ అపవాదును దూరం చేసుకోవడానికి ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటుపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. జనవరి మొదటి వారంలో అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను పిలిచి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, వారందరి అభిప్రాయాలు సూచనలు తీసుకున్న మేరకే ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.
జనవరిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయం
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీఎం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండగా, జనసేన సైతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని తేల్చి చెబుతోంది. ఇక వీరందరినీ ఒకే వేదిక మీదికి తీసుకెళ్లి మూడు రాజధానులు అంశంపై చర్చించి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కి కావాల్సిన సూచనలు సలహాలు తీసుకుని ఆ తరువాత రాజధానిపై ప్రధానంగా ప్రకటన చేయాలని భావిస్తున్నారు సీఎం జగన్. మూడు రాజధానుల ప్రతిపాదన మరియు జిఎన్ రావు ప్యానెల్ సమర్పించిన నివేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మూడు రాజధానులు, నిపుణుల కమిటీ రిపోర్ట్ పై చర్చ తర్వాతే ప్రకటన
అంతేకాకుండా, మేధావులు మరియు సామాజిక సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనమని కోరనున్నారు . అఖిలపక్ష సమావేశం సూచనల ఆధారంగా ప్రభుత్వం మూడు రాజధానులపై తుది ప్రకటన చేస్తుంది. జిఎన్ రావు కమిటీ నివేదికను అఖిలపక్ష భేటీలో వారి ముందు నుంచి మూడు రాజధానుల వ్యవహారంపై సమగ్ర చర్చ జరపాలని భావిస్తున్నారు. తద్వారా ఏకపక్ష నిర్ణయమని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అపవాదును లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్.