ఏపీ ప్రభుత్వం-జీఎంఆర్ ఒప్పందం: భోగాపురంలో విమానాశ్రయం, ‘మెట్రో’పై జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విమానాశ్రయం నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో జీఎంఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరస్మరణీయ రీతిలో భోగాపురం విమానాశ్రయంను నిర్మిస్తామని జీఎంఆర్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్తో అన్నారు. దీని కోసం అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు.
తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందన్నారు.
Recommended Video
విమానాశ్రయం నుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని తెలిపారు. విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపైనా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications