అమరావతికి రుణాలు ఎన్ని వేల కోట్లో తెలుసా ? నారాయణ కీలక ప్రకటన..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఇందుకోసం తాజా బడ్జెట్ లో సైతం 6 వేల కోట్లు కేటాయించింది. అయితే సొంత నిధులో, కేంద్రం ఇచ్చే అరకొర నిధులతోనే అమరావతి నిర్మాణం జరిగేలా లేదు. దీంతో భారీ ఎత్తున విదేశీ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి రుణాల్ని సేకరిస్తోంది. ఇలా సేకరిస్తున్న మొత్తం ఎన్ని వేల కోట్లో తాజాగా శాసనమండలిలో మంత్రి నారాయణ వెల్లడించారు.
అమరావతికి కేంద్ర సాయంపై శాసన మండలిలో సమాధానం ఇచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా స్పష్టత ఇచ్చారన్నారు. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత, రుణం ఎంత అనేది చర్చించి చెబుతామని అన్నారు. మరోవైపు హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే కేఎఫ్ డబ్ల్యూ అనే జర్మన్ బ్యాంక్ మరో 5 వేల కోట్లు రుణం అమరావతికి ఇస్తుందన్నారు.

ఇలా మొత్తం 31వేల కోట్లు అమరావతి రాజధానికి వివిధ రూపాల్లో వస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుందని, అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు అవసరమైన భూమిని ఎలా సేకరించాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అమరావతి డిజైన్ చేసినప్పుడే సెల్ఫ్ సస్టైనబుల్ గా డిజైన్ చేశారన్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభించడానికి బడ్జెట్ లో 6000 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. ప్రజలు టాక్స్ ల రూపంలో చెల్లించిన డబ్బులు అమరావతికి వాడకూడదనేది సీఎం చాలా క్లియర్ గా చెప్పారన్నారు.
రాజధాని కోసం తీసుకున్న రుణాలను అమరావతి పూర్తయిన తర్వాత అక్కడి భూములతో రీ పేమెంట్ చేస్తామన్నారు. బ్యాంకుల ద్వారా డబ్బులు రావడానికి ఆలస్యం అవుతోందని, ఈ బడ్జెట్లో కేటాయించిన 6000 కోట్లతో పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రుణాల ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత బడ్జెట్ డబ్బులు క్లియర్ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications