Budameru: బుడమేరు సమస్యకూ అదే పరిష్కారం ? ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...
ఏపీలో విజయవాడను ముంచెత్తిన భారీ వరదలకు బుడమేరు వాగు కారణమైంది. అంతకు ఎన్నో రెట్లు పెద్ధదైన కృష్ణానది వరద విజయవాడను ఏమీ చేయలేకపోయింది. కానీ బుడమేరు వాగు మాత్రం నగరంలో చాలా ప్రాంతాల్ని ముంచెత్తింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కృష్ణానది వరదల నుంచి నగరాన్ని కాపాడిన ఆ ఫార్ములానే ఇక్కడా ఉపయోగించాలని నిర్ణయించింది.
కృష్ణానదికి ఈ ఏడాది భారీగా వరద పోటెత్తింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వరద ప్రవహించింది. అయితే ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితుల్లో మునిగే ప్రాంతాలన్నీ ఈసారి మాత్రం సేఫ్ గానే ఉన్నాయి. దీనికి కారణం ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండు భాగాలుగా నిర్మించిన కృష్ణా రిటైనింగ్ వాల్. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ రిటైనింగ్ వాల్ ను గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదే కృష్ణానది వరదల నుంచి బెజవాడ స్థానికుల్ని కాపాడింది. దీంతో బుడమేరుకూ ఇలాంటి వాల్ నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే బుడమేరు కెనాల్ పొడవునా కృష్ణా రిటైనింగ్ వాల్ తరహాలోనే మరో రిటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వరద పరిస్ధితుల్లో దీని పనులు మొదలుపెట్టే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికి బుడమేరు గట్ల ఎత్తు పెంచుతున్నారు. వరద తగ్గాక బుడమేరు రిటైనింగ్ వాల్ పనులకు అయ్యే బడ్జెట్ అంచనా వేసి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ పనులు ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications