సాక్షి ప్రసారాల బ్యాన్పై ఏపీ కొత్త ట్విస్ట్, 'అమరావతి' సీక్రెట్ డీల్ ఏంటి: వైసిపి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత విషయం తమకు సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు హైకోర్టుకు తెలిపింది. ఏపీలో సాక్షి ప్రసారాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ గొడవ హైకోర్టుకు చేరింది.
సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయాలని తాము ఏమీ చెప్పలేదని ప్రభుత్వం తరఫు లాయర్ హైకోర్టులో తెలిపారు. ఎంఎస్ఓలకు తాము ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా, పోలీసులు ఎలాంటి ఉత్తర్వులు లేదా ఆదేశాలివ్వలేదన్నారు.
ఏపీలో సాక్షి టీవీ నిలిపివేత: చైనా యూనివర్సిటీలో నిరసనలు
ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా పడింది. కాగా, ముద్రగడ పద్మనాభం దీక్ష, అరెస్టు నేపథ్యంలో సాక్షి ప్రసారాలను నిలిపివేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై మంత్రులు, టిడిపి నేతలు గతంలో మాట్లాడుతూ.. సాక్షిలో ప్రసారాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, అందుకే నిలిపేశామని చెప్పారు. ఇప్పుడు హైకోర్టులో మాత్రం ప్రభుత్వం.. తమకు సంబంధం లేదని ట్విస్ట్ ఇచ్చింది.
అమరావతి ఒప్పందం రహస్యమేమిటి?: వైసిపి
రాజధాని అమరావతిని చంద్రబాబు ప్రభు్తవం అమ్మకానికి పెట్టిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు ఆరోపించింది. సింగపూర్ కంపెనీలతో అందుకు సంబంధించి రహస్య డీల్ కుదుర్చుకుందని, దానిని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది.
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అమరావతి ప్లాట్ల విభజనపై శ్వేతప్రతాన్ని విడుదల చేయాలని పార్టీ ఎస్సీ సెల్ విభాగం మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుందో భూములిచ్చిన రైతులకు కూడా తెలియడం లేదన్నారు. విదేశీ కంపెనీలకు అమరావతిని చంద్రబాబు అమ్మేస్తున్నారని, ప్రజల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల్లో ఇప్పటి వరకూ ఎంత అభివృద్ధి చేశారన్నారు.