ఏపీలో కొత్త సినిమాల రిలీజ్ పై డైలమా -ప్రభుత్వ ధరలతో నడపలేం- థియేటర్లను మూసేస్తున్నాం..!!
ఏపీలో కొత్త సినిమాలు విడుదల అవుతాయా. రిలీజ్ సమయంలోగా సమస్య పరిష్కారం అవుతుందా. టాలీవుడ్ ప్రముఖులు..ప్రభుత్వం మధ్య అంగీకారం కుదురుతోందా. రిలీజ్ సమయం లోగా వివాదం పరిష్కారం కాకుంటే ఏం జరగనుంది. ఇప్పుుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పైన ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. దీని పైన కోర్టుకు వెళ్లారు. సింగిల్ జడ్జి ప్రభుత్వం జారీ చేసిన జీవో ను సస్పెండ్ చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.

సోదాలు..స్వచ్చందంగా మూసివేత
ఆ కేసు విచారణలో ఉంది. ఇక, నాలుగైదు రోజులుగా ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్ల పైన సోదాలు జరుగుతున్నాయి. అనేక థియేటర్లను అధికారులు సీజ్ చేసారు. మరి కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో స్వచ్చందంగానే నిర్వాహకులు తమ థియేటర్లను మూసేసారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో తాము థియేటర్లను నడపలేమని తేల్చి చెబుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు నేరుగా సీఎం జగన్ తో చర్చలు చేస్తేనే పరిష్కారం లభిస్తోందని..అప్పటి వరకు ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందని తేల్చేస్తున్నారు. తాజాగా శుక్రవారం సైతం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగాయి.

భారీగా నోటీసులు...జరిమానాలు
థియేటర్ల నిర్వహణతో మొదలు...లైసెన్సులు... తినుబండారాల ధరల వరకు ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం ఇచ్చిన రేట్ల ప్రకారం థియేటర్ను నడపడం మా వల్ల కాదు... కావున తాత్కాలికంగా థియేటర్ను మూసివేస్తున్నాం' అంటూ హాలు ముందు బోర్డులు కనిపిస్తున్నాయి. తక్కువ తూకాలతో తినుబండాలను విక్రయించి ప్రేక్షకులను మోసం చేసున్న అనంతపురం నగరంలోని ఎస్వీ థియేటర్ క్యాంటీన్ నిర్వాహకులపై తూనికల కొలతలశాఖ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు.

హీరో నాని వ్యాఖ్యలతో కలకలం
ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాల్సిన సమయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణమయ్యాయి. ప్రేక్షకులను అవమానిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీని పైన మంత్రులు బొత్సా .. అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సోదాలు... టిక్కెట్ రేట్ల వివాద సమయంలో ఎగ్జిబిటర్లు అందరూ సమావేశం కావాలని నిర్ణయించారు.
అందులో అందరూ కలిసి థియేటర్ల నిర్వహణ పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, జనవరి మాసం తొలి వారం నుంచి పాన్ ఇండియా సినిమాల విడుదల కానున్నాయి. ఇప్పటికే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలను చాలా కాలం తరువాత విడుదలకు నిర్ణయించారు.

టాలీవుడ్ నుంచి ముందుకొచ్చేదెవరు
దీంతో.. వీటి విడుదల లోగా సమస్య పరిష్కారానికి టాలీవుడ్ ముఖ్యులు ముందుకు రావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఒమిక్రాన్ ఆంక్షలు మొదలవుతున్నాయి. జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని.. రాత్రి సమయాల్లో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేయాలని కేంద్రం తాజాగా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా సమయంలో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ తిరిగి కోలుకుంటుందని భావిస్తున్న సమయంలో టిక్కెట్ల ధరలు.. సినిమా థియేటర్ల లో సోదాలు...నిర్వాహకులే స్వచ్చందంగా థియేటర్ల మూసివేతతో నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది.

కొత్త సినిమాల విడుదల పై ప్రభావం
ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కారించుకోవాలలా.. లేక, న్యాయ పరంగా ముందుకెళ్లాలా అనే సందిగ్దతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు సైతం న్యాయపోరాటం దిశగా చర్చలు చేసినట్లు సమాచారం. దీంతో..రోజు రోజుకీ ముదురుతున్న ఈ వ్యవహారం పైన ఇప్పుడు టాలీవుడ్ నుంచే పరిష్కార దిశగా తొలి అడుగు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త సినిమాల విడుదల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అనే ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ తో పాటుగా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications