మల్లాది వాసు కామెంట్స్ పై విప్ సామినేని ఫైర్-అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని వార్నింగ్
వైసీపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఖండించారు. మల్లాది వాసు వ్యాఖ్యలపై స్పందించిన ఉదయభాను.. తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ పరిణామాలు, మల్లాది వాసు వ్యాఖ్యలపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
మల్లాది వాసు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలిక కోస్తామన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అసెంబ్లీలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన గుర్తుచేశారు. అనేక పార్టీలు మారిన చరిత్ర మల్లాది వాసుది అని సామినేని అన్నారు.ఎన్టీఆర్ కుటుంబం అంటే అందరికీ అభిమానం ఉందని, మల్లాది వాసు వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని సామినేని వ్యాఖ్యానించారు.
కులాల తరఫున వన భోజనాలు పెట్టుకుంటే సదరు కుల సమస్యల గురించి మాట్లాడుకోవాలని, వాటి పరిష్కారానికి చర్చించుకోవాలని, కానీ ప్రత్యర్ధులపై అవాకులు చవాకులు పేలడం మంచిది కాదని సామినేని అన్నారు. అనేక రకాల పార్టీలు మారిన మల్లాది వాసు ఇవాళ వైసీపీపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో ఎవరూ తన కుటుంబ సభ్యుల్ని దూషించకపోయినా కన్నీళ్లు పెట్టుకోవడం సిగ్గు పడాల్సిన విషయమన్నారు. ఓ పిరికిపందలా చంద్రబాబు ఏడ్వటం అన్నది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.
కమ్మ కులంలో పుట్టి ఎదిగిన కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు అంబటి రాంబాబు కుడా చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని దూషించడంపై స్పందించిన మల్లాది వాసు.. వారిని భౌతికంగా నిర్మూలించడానికి తన వంతుగా రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ వనసమారాధానలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన వాసు.. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినా రచ్చ మాత్రం ఆగడం లేదన్నారు. ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతున్న కుట్రలే అని వల్లభనేని వంశీ కూడా స్పందించారు.