సీఎం చంద్రబాబు కీలక ప్రకటన... వారందరి అకౌంట్లలో డబ్బులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ వరద బాధితులకు తియ్యటి శుభవార్తను వినిపించారు. ఇప్పటివరకు వరద సాయం అందని బాధితుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వారి బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే డబ్బులు వేస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి కచ్చితంగా పరిహారం అందుతుందన్నారు. బుడమేరు పొంగి విజయవాడ నగరానికి వరద రావడంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పరిహారం అందించే విషయం ఎంతవరకు వచ్చింది? ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి? తదితర విషయాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
సచివాలయాలవారీగా లబ్ధిదారుల జాబితాలను గుర్తించాలని, బీమా చెల్లింపు దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉంచారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను సంభవించినప్పుడు నెలరోజుల్లోగా బీమా సొమ్ము అందించామని, ఇక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతోందంటూ అధికారులను నిలదీశారు. వరదల్లో నష్టపోయినవారికి ఇప్పటివరకు రూ.625 కోట్ల నష్టపరిహారాన్ని అందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆపరేషన్ బడుమేరులో భాగంగా పరివాహక ప్రాంతాల్లో నివసించేవారిని ఇతర చోట్లకు తరలించి వారికి శాశ్వత పునరావాసం కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు.

భవిష్యత్తులో బుడమేరు నుంచి వరద ప్రమాదం రాకుండా ఉండటానికి డీపీఆర్ తయారు చేయాలని, కరకట్టలకు పడ్డ గండ్లను పూడ్చాలని, కాల్వకట్టలకు తిరిగి మళ్లీ గండ్లు పడకుండా చేయాలని, దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పారు. వీటికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రజల కష్టాలు తీర్చాలన్నారు.
వరదలవల్ల నష్టపోయినవారు, వస్తువులు దెబ్బతిన్నవారు పరిహారం అందలేదని, బీమా సొమ్ము రావడంలేదంటూ దరఖాస్తులు పెడుతున్నారు. వాటిని పరిష్కరించడంలో జాప్యం జరుగుతుండటంపై చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్నవారికి కూడా ఎందుకు పెండింగ్ పడుతోందని, కొందరికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడితే మరికొందరికి పడటంలేదని, లోపం ఎక్కడుందో తెలుసుకొని సవరించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications