లీక్ లకు చెక్ పెట్టే డ్రాఫ్ట్ బిల్లు .. మోదీ సంచలన ప్రకటన!
నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పైన ఆందోళన ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. విద్యార్థులతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ఈ క్రమంలో పరీక్ష పత్రాలు లీకేజీ సమస్యను ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.
పేపర్ లీక్లు అరికట్టేందుకు ప్రత్యేక డ్రాఫ్ట్ బిల్లు.. నేటి క్యాబినెట్ లో చర్చ
భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్ధరాత్రి వీడియో సందేశం ద్వారా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు లీక్ లను అరికట్టడానికి ప్రత్యేక బిల్లును శుక్రవారం క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేస్తామని ప్రకటించారు. ఇది విద్యావ్యవస్థలో నమ్మకాన్ని పునరుద్ధరించడం లో కీలకం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

పేపర్ లీక్ సాధారణ విషయం కాదు.. కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశంలో పేపర్ లీక్ అనేది సాధారణ విషయం కాదని లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల తీవ్ర మానసిక వేదనకు పేపర్ లీక్ కారణమన్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నామని పేర్కొన్న మోదీ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా త్వరగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అయితే దీంతో సరిపోదని మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు.
రాజకీయ లాభం కోసం కాదు, విద్యార్థుల సమస్యగా చూడాలి
లీక్ పేపర్ లీకేజీ వ్యవహారం పై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కొత్త చట్టం ద్వారా లీకులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రణాళిక రచించినట్టు తెలిపారు. ఈ సమస్యను రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోకుండా, జాతీయ స్థాయిలో విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని పిలుపునిచ్చారు.
లీక్ లకు పాల్పడితే యావజ్జీవిత ఖైదు
కొత్త డ్రాఫ్ట్ బిల్లు ద్వారా పరీక్ష సంస్థలలో భద్రత వ్యవస్థలను బలోపేతం చేస్తామని, డిజిటల్ మానిటరింగ్, కఠిన శిక్షలు, లీక్ లకు పాల్పడే వ్యక్తులకు జీవితాంతం జైలు శిక్ష వంటి నిబంధనలు ఉండవచ్చని అన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం తో పాటు, పరీక్ష వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని పేర్కొన్నారు.
లీకుల సమస్యలను సమూలంగా నిర్మూలించాలని ప్రధాని మోడీ
మొత్తంగా లీకుల సమస్యలను సమూలంగా నిర్మూలించాలని ప్రధాని మోడీ సంకల్పించారు. అందుకు నేటి నుంచి కార్యాచరణ చేపడుతున్నట్టు అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించడం, భవిష్యత్తులో ఇటువంటి లీకేజీ ఘటనలు జరగకుండా కఠిన చర్యలకు ఉపక్రమించడం విద్యార్థుల పోరాట ఫలితం.













Click it and Unblock the Notifications