పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే ముహూర్తం ఫిక్స్.. అది ఎవరూ మరచిపోని రోజు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగ లేదని భావించినా, తమ హయాంలో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పైన సుదీర్ఘమైన చర్చ చేసింది.
గోదావరి పుష్కరాల తొలిరోజు పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాలు 2027 లో ప్రారంభమయ్యే సందర్భంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును ఆరోజున జాతికి అంకితం చేయాలనే ఆలోచనను మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన చర్చించారు. షెడ్యూల్ ప్రకారం 2027 మార్చినాటికి ప్రాజెక్టు పూర్తి కావడంతో పుష్కరాల మొదటి రోజు శుభ సమయంలో ఈ మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

తమ ఆలోచనలను సీఎం దృష్టికి తెచ్చిన మంత్రులు
ఈ నిర్ణయం గోదావరి తీరప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తో పాటు, రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. క్యాబినెట్ లోని మంత్రులు తమ ఆలోచనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయినిగా పోలవరం ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఏపీ రైతుల సాగునీటి అవసరాలను తీర్చే ఉద్దేశంతో నిర్మాణం చేయబడుతుంది. లక్షల ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతుంది.
పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రగతి
తద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. రైతుల ఆదాయం జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అంతేకాదు తాగునీటి సరఫరా తో పాటు పరిశ్రమల అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్టును పుష్కరాల సందర్భంగా తొలిరోజు జాతికి అంకితం చేయడం ద్వారా గోదావరి నది పవిత్రతతో పాటు, పోలవరం ఇంజనీరింగ్ విజయాన్ని ఒకేసారి సెలబ్రేట్ చేసుకోవడం అవుతుంది.
కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు
ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలను తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు సాఫీగా ముందుకు సాగుతున్నాయి.
పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ కు కేంద్రం తోడ్పాటు
ఇదిలా ఉంటే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కూడా కేంద్రం నుంచి తోడ్పాటు లభిస్తుందని ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు జాతికి ఎప్పుడు అంకితం చేస్తాము అనేది చర్చించిన చంద్రబాబు పుష్కరాల సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications