''ఫ్యామిలీ డాక్టర్''... Dr.వైఎస్ జగన్మోహన్ రెడ్డి!!
''ఫ్యామిలీ డాక్టర్'' కాన్సెప్ట్ను ప్రతిష్టాత్మకంగా తెస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటారని వివరించారు. విలేజ్ క్లినిక్లకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు లభిస్తాయన్నారు. కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులోకి వస్తారని, వైద్యులు మారినా వారి ఫోన్ నెంబర్లు మాత్రం పర్మనెంట్గా ఉంటాయని చెప్పారు.
ఆరోగ్య పరంగా ఏ సమస్య తలెత్తినా ప్రజలు నేరుగా వైద్యులకు ఫోన్ చేసే సదుపాయాన్ని కల్పించనున్నామని, ఆ తర్వాత ఏరియా ఆస్పత్రి వైద్యులు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య తలెత్తినా మన వైద్యుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలనేది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని, ఈ పథకాన్ని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ముకానీయకుండా అమలు చేస్తామని కృష్ణబాబు చెప్పారు.
దీనివల్ల వైద్యులకు కూడా మంచిపేరు వస్తుందన్నారు. ఇప్పటివరకు వైద్య, ఆరోగ్యశాఖలో 42వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో నాలుగువేల మందిని నియమించబోతున్నామని, సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ నాలుగువేల ఉద్యోగులను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. పైలెట్ ప్రోగ్రామ్ కింద సెప్టెంబరు మొదటివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.