రాజధానిపై బాబు ప్లాన్: మేధా టవర్స్ నుంచే పాలన
హైదరాబాద్: విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలనే నిర్ణయంపై విమర్శలు తలెత్తుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఆయన పక్కాగా విజయవాడ సమీపంలోని గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి పాలన సాగించాలనే ఉద్దేశంతో ఉన్నారు.
మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనులు జరుగనున్నాయి. అక్టోబర్ రెండో తేదీ నుంచి విజయవాడ సమీపంలోని గన్నవరం నుంచి ఏపీ ప్రభుత్వం పనిచేయడం ఆరంభిస్తుంది. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మేధా టవర్స్ భవనం నుంచి ఏపీ సర్కారు తన విధులను నిర్వర్తించనుంది.
ఈ భవనాన్ని అక్టోబర్ 2 నుంచి ఏపీ సచివాలయంగా భావించవచ్చు. మేధా టవర్స్ను గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీ రంగం కోసం నిర్మించారు. కాని ప్రస్తుతం అక్కడ ఒకటి రెండు కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ భవనంలో మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది.
ప్రస్తుతం 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మాత్రమే ఐటీ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇంకా లక్షా 76 వేల చదరపు అడుగుల స్థలం మేధా టవర్స్లో ఖాళీగా ఉంది. తర్వలో ఏపీ ప్రభుత్వానికి చెందిన 25 శాఖల కార్యాలయాలను హైదరాబాద్ నుంచి ఈ టవర్స్లోకి మార్చనున్నారు. తొలి విడతలో ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను (హెచ్ఓడిలను) మేధా టవర్స్కు తరలిస్తారని తెలుస్తోంది.