సంయమనం పాటించండి: హితవు పలికిన ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి
Chagani Koteswara Rao: కొత్త సంవత్సరం 2025ను పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు రాష్ట్ర ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించిన వీడియో అది.
సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుకుందామని, అసత్య ప్రచారాలు, దూషణలకు స్వస్తి పలుకుదాం అంటూ కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాలు, పట్టణాల్లో విస్తృతంగా హోర్డింగులు వెలిశాయి. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అని సూచించే కోతి బొమ్మలను అందులో ముద్రించారు.

దీనికి కొనసాగింపుగా తాజాగా చాగంటి కోటేశ్వర రావు తన గళం విప్పారు. సోషల్ మీడియాను మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఒకరిని పరుషంగా మాట్లాడితే.. వాళ్లు కూడా అంతే పరుషంగా స్పందించితే మనకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించుకోవాలని అన్నారు. మనం ఓ మాట అన్నప్పుడు ఎదుటివాళ్లు బాధపడతారని అనుకున్నప్పుడు అలా ప్రవర్తించకూడదని చెప్పారు.
తాము చేసే పనుల వల్ల తోటి వాళ్లకు దుఖాన్ని కలిగిస్తుందని తెలిసినప్పుడు ఆ పని చేయడానికి పూనుకోకూడదని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా సంయమనాన్న పాటించాలని కోరారు. సమస్త భూమండలంపై 84 లక్షల జీవరాశులు ఉన్నాయని, అన్నింట్లో కంటే వాక్కు ఉన్నది ఒక్క మనిషికి మాత్రమేనని గుర్తు చేశారు.
అలాంటి మనిషి- తన వాక్కును పదిమంది సంతోషం కోసం వాడాలే తప్ప ఇతరుల మనస్సులను గాయపరిచేలా మాటలను వాడకూడదని చాగంటి కోటేశ్వరరావు హితబోధ చేశారు. ఆయా విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాను సక్రమంగా వాడుకోవాలని సూచించారు.
అంతే తప్ప ఇతరుల మనస్సులు బాధపడే విధంగా- ప్రత్యేకించి కుటుంబ సభ్యులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదని ఆయన అన్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వినియోగదారులు తమను తాము నియంత్రించుకోవాలని, సభ్యత సంస్కారాలను చాటుకుందామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications