ఏపీలో నూతన మద్యం పాలసీ - పాత బ్రాండ్లు సిద్దం..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హాయంలో వివాదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయాలని తాజా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాలసీ అమలుతో పాటుగా పాత బ్రాండ్లను అందుబాటులోకి తెస్తోంది. గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీకి సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నారు.
కొత్త మద్యం పాలసీ
ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. జూలైన 1 నుంచి కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్లు, కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది. వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.

పాత బ్రాండ్ల అమ్మకాలు
వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టలరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని అనుమానిస్తున్నారు. ఏపీ బెవరేజస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లోనూ కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో ఏపీలో లక్ష 24వేల 312 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఒక అంచనా. అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే 30వేల 78కోట్ల సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకు 2వేల 506 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య 75వేల 284 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తోంది.
ధరల పై కసరత్తు
ప్రస్తుతం ఏపీలో సర్కార్ ఆధ్వర్యంలో 2వేల 934 లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రయివేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్నిరకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత డిస్టలరీలను రద్దు చేస్తూ...తిరిగి కొత్త మద్యం దుకాణాలకు డిపాజిట్ ధరలను నిర్ణయించనున్నారు. ఇక, పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావటంతో మందుబాబులకు ఖుషీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications