సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన, పోస్టుల రద్దు - ప్రభుత్వ నిర్ణయం..!!
సచివాలయ వ్యవస్థపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీ కరించాలని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కార్యదర్శుల విషయంలోనూ కీలక మార్పులు చేయనున్నారు. కొంత మంది సిబ్బందిని పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు.
కీలక ప్రతిపాదనలు
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పైన ప్రభుత్వం పోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపైన కీలక ప్రతిపాదనలు చేసారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన వైసీపీ సర్కారు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్చార్ట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చారు.

మాతృసంస్థలకు అప్పగింత
గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలినవారిని వారి మాతృసంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీవోగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారినందరినీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశుసంవర్థక సహాయకులు తదితర పోస్టులను రద్దుచేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
పంచాయితీలకే పరిమితం
పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీలకే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాల్లో సుమారు 1.26లక్షల మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన ఐదారుగురు కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలినవారిని ఆయా మాతృసంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలను బలోపేతం చేసినట్లవుతుందని చెబుతున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలందించేలా ఈ సచివాలయాలను తీర్చిదిద్దనున్నారు.












Click it and Unblock the Notifications