పాఠశాలలకు సెలవు రద్దు - ప్రత్యేకంగా ఇలా..!!
పాఠశాలలకు సెలవు రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. రేపు రెండో శనివారం సెలవును రద్దు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఆజాదీ కా మహోత్సవ్ వేడుకల్లో విద్యార్ధులను భాగస్వాములను చేసే కార్యక్రమాల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం - రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇందుకోసం ప్రతీ పాఠశాలలోనూ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు నిర్దేశించింది.
ప్రతీ ఇంటికి గ్రామ -వార్డు సచివాలయాల ద్వారా జాతీయ జెండాల పంపిణీకి నిర్ణయించింది. ప్రతీ ఇంటి పైన జాతీయ జెండా ఎగుర వేయాలనే కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జెండాలను ప్రతీ ఇంటికి అందిస్తోంది. అదే విధంగా జెండా ఆవిష్కరణ సమయంలో చేయాల్సినవి ఏంటి.. చేయకూడనవి ఏంటో వివరిస్తూ కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. పలువురు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు తమ డీపీలను మార్చేసి..జాతీయ జెండాలను డీపీలుగా ఫిక్స్ చేసారు. రేపు రెండో శనివారం నాడు పని దినంగా ప్రకటిస్తూ అన్ని జల్లాల్లో డీఈఓలు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు.
Recommended Video
శనివారం ప్రతీ పాఠశాలలోనూ జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. సెమినార్లు..సామూహిక చర్చలు..వ్యాస రచన పోటీలు నిర్వహించాలని స్పష్టం చేసారు. విద్యార్ధులంతా జాతీయ గీతాలు..స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన పాటలు పాడాలి. అదే విధంగా 2021 జెండా కోడ్ అనుసరిస్తూ జాతీయ జెండా కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ పాఠశాలలోనూ ఈ కార్యక్రమాలు తప్పని సరిగా అమలు చేయాలని..ప్రభుత్వ - ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం నిర్దేశించింది.