ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పీఆర్సీ పై కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించింది. 12వ పీఆర్సీ ఏర్పాటు పైన అడుగులు మొదలయ్యాయి. ఉద్యోగుల అంశాల్లో ముఖ్యమైన 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించిన దస్త్రాలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది. కొత్త పీఆర్సీపైన అధ్యయనం..నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది.
పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తు: వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. జూలై నుంచి కొత్త వేతన స్కేల్ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ వేతనాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాల పైన ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
ఈ నేపథ్యంలో సంబంధింత ఫైల్ ను సర్క్యులేట్ చేయాలని ఆర్దిక శాఖ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సర్క్యులర్ పంపారు. పీఆర్సీ కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ సీఎస్ సమీర్ శర్మతో పాటుగా మరి కొంత మంది పదవీ విరమణ చేసిన అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

పెండింగ్ అంశాలపై ఫోకస్: ఇప్పటికే ఉద్యోగుల పెండింగ్ అంశాల పైన ఆందోళన చేస్తున్న సంఘాల నేతలతో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చర్చలు చేసారు. వచ్చే కేబినెట్ లో సమస్యల పైన చర్చిస్తామని.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి..నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇటు ప్రభుత్వం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అన్ని వర్గాలకు ప్రయోజనకరం చేకూర్చే నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఇక, పీఆర్సీ సమయం కూడా దగ్గర పడటంతో ఆ దిశగా ఇప్పుడు కసరత్తు ప్రారంభించింది. కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీంకు సంబందించి చర్చలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు నష్టం లేకుంగా సీపీసీ రద్దు హామీ అమలు దిశగా మధ్యే మార్గంగా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్: ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయంలో అడుగు పెడుతూనే 27 శాతం ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత పీఆర్సీ అమలుకు సంబంధించి పలు దఫాల చర్చల తరువాత నిర్ణయాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
టీడీపీ తాజాగా మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించ లేదు. ఇప్పుడ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు కీలకం కానుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే అధికారికంగా సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. సీఎం జగన్ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications