తగ్గని ఎండలు , ఒంటిపూట బడులు - ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ మూడో వారం వచ్చినా ఎండలు తగ్గుముఖం పట్టటం లేదు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 12 నుంచి వేసవి సెలవుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మొదలయ్యాయి. కొనసాగుతున్న వేసవి కారణంగా సెలవులు పొడిగించాలని పలు అభ్యర్దనలు వచ్చాయి. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూడ బడులు నిర్వహించాలని గతంలో నిర్ణయించిన ఏపీ విద్యా శాఖ..ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఒంటి పూడ బడులు పొడిగింపు:
ఏపీలో ఎండలు తగ్గటం లేదు. ముందుగా ప్రకటించిన ఎకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూడ బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

17వ తేదీ వరకు అదే విధంగా పాఠశాలలు కొనసాగాయి. ఇప్పటికీ ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వరకు పాఠశాలలో ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది.
ప్రభుత్వం మార్గదర్శకాలు:
ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ చేయాలని తెలిపింది. ఇక చివరగా ఉదయం 11.30 గంటల నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వర్షాలు ప్రారంభమై వాతావరణంలో మార్పు కనిపిస్తే 26వ తేదీ నుంచి ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఈ వారంతంలో విద్యాశాఖ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఎండలు తగ్గేవరకూ ఇలాగే:
ఈ నెల 12వ తేదీన పాఠశాలల ప్రారంభం సమయంలోనే ఎండలు తగ్గని కారణంగా మరి కొద్ది రోజులు వేసవి సెలవులు పొడిగించాలని ప్రభుత్వానికి ప్రతిపక్షాలు..పేరెంట్స్ కమిటీ లేఖలు రాసాయి. దీంతో ఒంటి పూట బడుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పిటికీ ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల ప్రారంభం నుంచి విద్యార్ధులకు విద్యా కానుక అందిస్తోంది. ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమల్లో భాగంగా నాలుగో విడత నిధులు విడుదల చేయనుంది. 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ 15 వేల చొప్పున నిధులను జమ చేయనుంది.












Click it and Unblock the Notifications