15న రైతు భరోసా నిధులు - రైతు ఖాతాలకు రూ.3,657.87 కోట్లు : ఆర్బీకేల్లో జాబితా..!!
ఏపీలో రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్దం అవుతోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను ఈ నెల 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 2019-20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020-21లో 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021-22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయం అందించారు. 2022-23లో 48.77 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు.
వీరికి మొదటి విడతగా ఈ నెల 15న రూ.3,657.87 కోట్ల సాయం అందించనున్నారు. ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నారు. అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం నేటి (శుక్రవారం) నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలిస్తారు.
జాబితాలో చోటుదక్కని అర్హులెవరైనా ఉంటే వారి అభ్యర్థనలను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హతను నిర్ధారించుకున్న తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుభరోసా కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగిన వారికి మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు.
వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులకు ఈ సాయం అందుతోంది. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాగుదారులను గుర్తించాల్సి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో గుర్తించిన అర్హులైన కౌలు రైతులకు ప్రస్తుతం సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్టు) కార్డుల జారీచేస్తునారు.